ఇళ్ల నిర్మాణాలకు రూ.82 కోట్లు చెల్లించాం
ABN , First Publish Date - 2022-01-22T05:32:44+05:30 IST
ఇళ్ల నిర్మాణాలకు రూ.82 కోట్లు చెల్లించాం
కలెక్టర్ నివాస్ వెల్లడి
ఇబ్రహీంపట్నం/పాయకాపురం, జనవరి 21 : జిల్లాలో గృహ నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు రూ.82 కోట్లు ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ నివాస్ తెలిపారు. పేదలకు ఇబ్రహీపట్నంలో ఇచ్చిన లే అవుట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో 2,400 ప్లాట్లు, ఇబ్రహీంపట్నంలో 780 ప్లాట్లు, కొండపల్లిలో 800 ప్లాట్లు పేదలకు కేటాయించామన్నారు. లబ్ధిదారులకు అందించే ఇనుము, సిమెంట్ పంపిణీ కోసం గోడౌన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని, అందుకు అవసరమైన పునాదులు కూడా తీయించాలని సూచించారు. ప్రతి వారం ఒక్కో వలంటీర్ ఒక గృహం, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 5 గృహాలు, హౌసింగ్ ఏఈ/డీఈ 20 గృహాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులు నిర్మాణం చేపడితే బేస్మెంట్ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్ను తనిఖీ చేశారు. పార్కులో సీతాకోకచిలుకల జాతులు తెలిపే చిత్రాలు, వాటి వివరాలు ప్రదర్శించమని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమీషనర్ శ్రీధర్, తహసీల్దార్ ఎం.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.