రుయా ఘటనలో మృతులకు పరిహారం
ABN , First Publish Date - 2021-05-14T05:15:56+05:30 IST
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక సోమవారం రాత్రి చనిపోయిన కొవిడ్ బాధితుల జాబితాను గురువారం కలెక్టర్ హరినారాయణన్ విడుదల చేశారు.
మూడురోజుల తరువాత చనిపోయినవారి జాబితా విడుదల
చిత్తూరు కలెక్టరేట్, మే 13: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక సోమవారం రాత్రి చనిపోయిన కొవిడ్ బాధితుల జాబితాను గురువారం కలెక్టర్ హరినారాయణన్ విడుదల చేశారు. ఆక్సిజన్ సరఫరా ఆగిన వ్యవధిలో చనిపోయిన వారి సంఖ్య 11 మంది మాత్రమేనని, అదే రోజు చనిపోయిన వారి సంఖ్య మరికొంత ఉండవచ్చని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మృతుల్లో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించగా కొన్ని కుటుంబాలకు గురువారం పరిహారాన్ని అందించారు.వీరిలో చిత్తూరు తేజానగర్కు చెందిన భువనేశ్వర్బాబు కుటుంబ సభ్యులకు గురువారం ఆర్థికసాయాన్ని అందించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ చేతుల మీదుగా రూ.10 లక్షల పరిహారాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు.