పుష్కరకాలమైనా పరిహారమేదీ?

ABN , First Publish Date - 2021-08-30T06:42:11+05:30 IST

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చి సహకరించాలని అధికారులు కోరారు.

పుష్కరకాలమైనా పరిహారమేదీ?
బాధిత రైతుల ఆందోళనతో వికృతమాల సమీపంలో ఆగిన ఎయిర్‌పోర్టు ప్రహరీ పనులు

తిరుపతి ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతుల పాట్లు 


ఏర్పేడు, ఆగస్టు 29: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చి సహకరించాలని అధికారులు కోరారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆశతో ఎందరో రైతులు పంటపొలాలను అప్పగించారు. తమ కుటుంబాలకు ఆదరువుగా ఉన్న సాగు భూములిచ్చిన వీరికి.. పుష్కరకాలంగా పరిహారం అందలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తిరుపతికి ఉన్న ప్రాధాన్యం.. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ విస్తరణకు 2009లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి అవసరమైన 800 ఎకరాలను ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలోని 500 మంది రైతుల నుంచి సేకరించారు. ఏర్పేడు మండలం వికృతమాల, గోవిందవరం, పాపానాయుడుపేట, సుబ్బయ్యగుంట, రేణిగుంట మండలం గుత్తివారిపల్లె, వెదళ్లచెరువు గ్రామాల రైతులు ఈ భూములిచ్చారు. 710 ఎకరాలకు అప్పట్లోనే పరిహారం ఇచ్చారు. 90 ఎకరాలకు సంబంధించి 52 మంది రైతులకు పుష్కరకాలం గడచినా పరిహారం అందలేదు. పరిహారం కోసం వీరు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం, ఎయిర్‌పోర్టు వద్ద ధర్నాలు చేశారు. ఆ సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్న అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఈనెల 16న వికృతమాల వద్ద ఎయిర్‌పోర్టు అధికారులు ప్రహరీ పనులు చేపట్టగా.. బాధిత రైతులు అడ్డుకున్నారు. ఇలాగైతే సాయుధ బలగాలను రంగంలోకి దింపాల్సి వస్తుందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సురేష్‌ హెచ్చరించడం వివాదం రేపింది. దీనిపై రైతులు తిరుపతి ఆర్డీవో, ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆదివారం కూడా వికృతమాల రైతులు పరిహారం ఇవ్వాలంటూ పనులు జరుగుతున్న ప్రాంతంలో నిరసన తెలిపారు. 


అర్హులు నష్టపోయారంటూ విమర్శలు.. 

భూమి లభ్యత కంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులకు పట్టాలివ్వడం పరిహారం మంజూరుకు అడ్డంకిగా మారినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే అదనుగా బోగస్‌ పట్టాల వ్యవహారం కూడా తెరపైకి రావడం మరింత ఇబ్బందులు తెస్తోందని అంటున్నారు. దీంతో అర్హులకు అందాల్సిన పరిహారం సొమ్ము పలుకుబడి ఉన్న పెద్దల ఖాతాలకు చేరిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. 


త్వరలో రైతులకు న్యాయం చేస్తాం 

విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు పరిహారం అందని అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఏర్పేడు తహసీల్దారు ఉదయ్‌సంతోష్‌ తెలిపారు. పలుమార్లు జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారన్నారు. రికార్డుల పరిశీలన పూర్తయిందనీ, త్వరలో బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 

Updated Date - 2021-08-30T06:42:11+05:30 IST