భార్యతో విభేదాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-11-14T12:33:44+05:30 IST
భార్యతో విభేదాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్/దిల్సుఖ్నగర్ : మనస్తాపం చెందిన చైతన్యపురి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి చైతన్యపురి ఇన్స్పెక్టర్ రవి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్కు చెందిన నరేష్(40) చైతన్యపురి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆయనకు భార్యతో విభేదాలు ఉన్నాయి. కొద్దికాలం క్రితం ఆమె కుమారుడు, కూతురుని తీసుకుని ఆంధ్రప్రదేశ్లోని పుట్టింటికి వెళ్లింది. హయత్నగర్లో నరేష్ ఒంటిరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన నరేష్ గురువారం రాత్రి 11.45 గంటల సమయంలో తోటి ఉద్యోగి శ్రీకాంత్కు ఫోన్ చేసి కుటుంబ సమస్యల నేపథ్యంలో చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
శ్రీకాంత్ సమాచారం మేరకు ఎస్ఐ నాగేశ్వరరావు సెల్ఫోన్ ఆధారంగా గాలింపు చేపట్టారు. 1.30సమయంలో పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో ఉన్నట్లు గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న నరేష్ను ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో క్రిమిసంహారక మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. నరేష్ గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.