వెంటాడుతున్న కరోనా
ABN , First Publish Date - 2021-04-20T03:26:04+05:30 IST
రెండో విడత కరోనా మండల ప్రజలను వెంటాడుతోంది.
ఐదుగురి విద్యార్థులకు కరోనా
వరికుంటపాడు, ఏప్రిల్ 19: రెండో విడత కరోనా మండల ప్రజలను వెంటాడుతోంది. తాజాగా సోమవారం పెద్దిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఈ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కరోనాకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మండలంలో ఇప్పటి వరకు 12 మంది కరోనా బారినపడ్డారు. కాగా స్థానిక వైద్యశాలలో 72 మంది ఫ్రంట్ వారియర్స్కు వ్యాక్సిన్ వేశారు. హుస్సేన్నగర్ వైద్యశాలలో 58 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని సీహెచ్వో రాజశేఖర్రాజు తెలిపారు. ఇటీవల కాకొల్లువారిపల్లి బీసీ కాలనీలో ఇద్దరు కరోనా బారిన పడడంతో పంచాయతీ కార్యదర్శి మునుస్వామి గ్రామంలో పారిశుధ్యం పనులు చేపట్టి బ్లీచింగ్ చల్లించారు.
కలిగిరిలో కరోనా కలకలం
కలిగిరి, ఏప్రిల్ 19: మండలంలో సోమవారం 11 మందికి కరోనా సోకింది. వారిలో ఇద్దరు కేజీబీవీ విద్యార్థులు, ఒకరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి, మరో ప్రయివేట్ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థికి, ఉపాధ్యాయిని ఉన్నారు. వీరు కాకుండా మండలంలో మరో ఆరుగిరికి కరోనా సోకింది.