కృష్ణా జిల్లాలో కొత్తగా 597 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-04-30T16:00:47+05:30 IST
జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతి..
మరో ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి-విజయవాడ: జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం ఒక్కరోజే 597 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు బాధితులు మరణించారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60,756 కి పెరిగింది. మరణాలు అధికారికంగా 763 కి చేరుకున్నాయి. 7,732 మంది బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 52,261 మంది వ్యాధి నుంచి కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక బులెటిన్లో పేర్కొంది.
కరోనాకు ఇద్దరు జర్నలిస్టులు బలి
జిల్లాలో గురువారం ఒక్కరోజే ఇద్దరు జర్నలిస్టులు కరోనాకు బలైపోయారు. ప్రముఖ దినపత్రిక (ఆంధ్రజ్యోతి కాదు)కు చెందిన విజయవాడ యూనిట్లో పనిచేస్తున్న ఓ సబ్ ఎడిటర్కు వైరస్ సోకడంతో విజయవాడ ప్రభుత్వ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఓ టీవీ చానల్ (ఏబీఎన్ కాదు)కు రిపోర్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విజయవాడలోనే మరో చానల్లో పనిచేస్తున్న కెమెరామెన్ తల్లి కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ మరణించారు.