ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా.. మరో ఫ్యామిలీలో ఐదుగురికి..!
ABN , First Publish Date - 2020-07-27T20:05:02+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో కార్యాలయ అధికారి డాక్టర్ నవీన్కుమార్ తెలిపారు. శివ్వంపేటలో 2, అల్లాదుర్గం, చేగుంట, కౌడిపల్లిలో ఒకటి చొప్పున కొవిడ్ కేసులు నమోదు కాగా.
మెదక్ జిల్లాలో 21 మందికి కరోనా పాజిటివ్
మెదక్ అర్బన్(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం జిల్లావ్యాప్తంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో కార్యాలయ అధికారి డాక్టర్ నవీన్కుమార్ తెలిపారు. శివ్వంపేటలో 2, అల్లాదుర్గం, చేగుంట, కౌడిపల్లిలో ఒకటి చొప్పున కొవిడ్ కేసులు నమోదు కాగా.. మెదక్లో ఒక కుటుంబంలో ఐదుగురు, మరో కుటుంబంలో ఎనిమిది మంది కరోనా బారినపడ్డారు. జిల్లా కేంద్రంలోని సాయినగర్లో కాలనీకి చెందిన ఒకరు ఎస్పీ కార్యాలయంలోని ఎస్బీ విభాగంలో వీఆర్ఎ్సఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఎస్ఐ భార్యకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా కరోనా లక్షణాలున్నట్లు తేలింది. దీంతో మెదక్ ఏరియా ఆస్పత్రిలో రెండురోజుల క్రితం ఎస్ఐ కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారందరినీ హోంఐసోలేషన్లో ఉంచారు. పట్టణంలోని 19వవార్డులో నివాసముంటున్న ఏఎన్ఎంతో పాటు కుటుంబంలోని ఏడుగురికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.
వెల్దుర్తి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తి (40)కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి బాపురెడ్డి తెలిపారు. తీవ్రమైన దగ్గు, జ్వరం ఉండడంతో నగరంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఆదివారం గ్రామంలో ఆ వ్యక్తి ఇంటి చుట్టూ హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కుటుంబ సభ్యులకు ఫార్మా స్కానింగ్ పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. ముందుజాగ్రత్తగా గ్రామంలో 15 రోజులపాటు బంద్ అమలులో ఉంటుందని సర్పంచ్ శంకర్రెడ్డి తెలిపారు.
శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి డాక్టర్ భవాని తెలిపారు. వీరిద్దరూ అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని ఆమె చెప్పారు.
తూప్రాన్ సీహెచ్సీలో కొవిడ్-19 పరీక్షలు
పట్టణంలోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో కొవిడ్-19 (రాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టు) పరీక్షలు చేపడుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్సింగ్ తెలిపారు. కొవిడ్ -19 పరీక్షలను మంగళ, గురు, శనివారాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజు 20 మందికి టెస్టులు చేస్తామన్నారు. ప్రసవం కోసం వచ్చే జరిగే గర్భిణులకు, గుండె సంబంధ, ఆస్తమా రోగులకు పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
నర్సాపూర్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్తగా పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించనున్నారు. నేటి నుంచి పదిహేను రోజుల పాటు అన్ని వ్యాపార సంస్థలను మూసి ఉంచాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి.