కరోనా వస్తోంది.. పారిపోండి!
ABN , First Publish Date - 2021-04-09T07:08:34+05:30 IST
‘‘పోలీసులు పెద్ద సంఖ్యలో ఎప్పుడైనా రావొచ్చు..! ఏ క్షణంలోనైనా రావొచ్చు..! వారిలో కొవిడ్ ఉన్న వారు కూడా ఉండొచ్చు..! అదే జరిగితే.. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న గిరిజన గూడేలకు కరోనా రావడం ఖాయం..! అంతా పారిపోండి..!’’..
కొవిడ్ భయంతో గిరిజన గూడేలు ఖాళీ
తెర్రం కాల్పులకు ముందు హిడ్మా వ్యూహం
తన స్వగ్రామంలోనే వారికి భోజన సదుపాయాలు
ఒక్కొక్కరుగా తిరిగివస్తున్న 30 గూడేల ప్రజలు
చర్ల, ఏప్రిల్ 8: ‘‘పోలీసులు పెద్ద సంఖ్యలో ఎప్పుడైనా రావొచ్చు..! ఏ క్షణంలోనైనా రావొచ్చు..! వారిలో కొవిడ్ ఉన్న వారు కూడా ఉండొచ్చు..! అదే జరిగితే.. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న గిరిజన గూడేలకు కరోనా రావడం ఖాయం..! అంతా పారిపోండి..!’’.. ఇదీ ఛత్తీ్సగఢ్లోని బీజాపూర్ జిల్లా తెర్రాం వద్ద పోలీసులు-నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులకు ముందు.. మావోయిస్టులు గిరిజనులకు అందించిన సమాచారం. దీంతో.. కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న జొన్నగూడ, టేకులగూడెం, తెర్రాం గ్రామాలతోపాటు.. 30 గూడేలు ఒక రోజు వ్యవధిలో ఖాళీ అయిపోయాయి. మావోయిస్టుల వ్యూహం ఫలించింది..! డీహైడ్రేషన్ నుంచి తప్పించుకునేందుకు.. నీటి కోసం జొన్నగూడ గ్రామానికి వెళ్లిన జవాన్లను సైతం మావోయిస్టులు కాల్చి చంపారు. గత శుక్రవారమే గూడేలను ఖాళీ చేసి, వెళ్లిపోయిన స్థానిక గిరిజనులు.. గురువారం ఇంటిబాట పట్టారు.
ఒక్కొక్కరుగా తమ గ్రామాలకు, గూడేలకు వస్తున్నారు. వారిని విలేకరులు కదిలించగా.. ఒక్కొక్కరు ఒక్కో విధమైన కథనాన్ని చెబుతున్నారు. ‘‘మా గూడెం పెద్ద హెచ్చరిక జారీ చేశారు. పోలీసులతోపాటు.. కరోనా వచ్చే అవకాశం ఉందని భయపెట్టారు. అందుకే ఊరు విడిచి వెళ్లిపోయాం..’’ అని జొన్నగూడకు చెందిన ఓ యువకుడు చెప్పాడు. టేకులగూడెం వాసులు కూడా ఇలాంటి కథనాలే చెబుతున్నారు. స్థానికంగా ఉండే మరో గిరిజనుడు మాత్రం.. అన్ని ఊళ్లు, గూడేల ప్రజలంతా పూహర్తిలో తలదాచుకున్నట్లు చెప్పాడు. ‘‘పోలీసులు వస్తే.. చిన్నాపెద్ద చూడకుండా.. నక్సల్స్ జాడ చెప్పాలని కొడుతుంటారు. అందుకే.. మేమంతా పూవర్తికి వెళ్లాం. అక్కడ మాకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు’’ అని మరో యువకుడు వివరించారు. కాగా మాడ్వీ హిడమా అలియాస్ హిడ్మా స్వగ్రామం పూవర్తి కావడం గమనార్హం. పక్కా పథకంతోనే ఈ గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించి, సొంతూళ్లో వసతి సదుపాయాలు కల్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు.