ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య.. కరీంనగర్ జిల్లాలో కేసుల వివరాలివీ..!
ABN , First Publish Date - 2020-08-12T20:13:19+05:30 IST
కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో సోమవారం జిల్లావ్యాప్తంగా 121 మందికి కరోనా సోకినట్లు ప్రకటించింది. కరీంనగర్
కరోనా @ 121.. పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు
హైదరాబాద్లో ఒకరి ఆత్మహత్య
మరో ఆరుగురు మృతి
11న కూడా అదేస్థాయిలో వైరస్ వ్యాప్తి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో సోమవారం జిల్లావ్యాప్తంగా 121 మందికి కరోనా సోకినట్లు ప్రకటించింది. కరీంనగర్ కిసాన్నగర్కు చెందిన 72 సంవత్సరాల వృద్ధుడు, కొత్తపల్లి పట్టణానికి చెందిన 46 ఏళ్ల మాజీ వార్డు సభ్యుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. అలాగే గోదావరిఖనికి చెందిన ఇద్దరు సోమవారం రాత్రి కరీంనగర్ ఆసుపత్రిలో చనిపోయారు. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. బోయవాడకు చెందిన ఓ రిటైర్డు ఉద్యోగి కరోనా వ్యాధిబారిన పడి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుస్సేనిపురాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.
మంగళవారం జిల్లాలో..
మంగళవారం స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు కొత్తపల్లి మండలంలోని సీతారాంపూర్లో ఒకరికి, కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్లో ఒకరికి, తీగలగుట్టపల్లిలో మరోకరికి కరోనా వ్యాధిసోకినట్లు తెలిసింది. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో 67 మందికి యాంటిజన్ రాపిడ్ టెస్టులు నిర్వహించగా 8 మందికి, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. గన్నేరువరం మండలంలోని మైలారంలో ఒకరికి, ఇల్లందకుంట మండలంలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో 63 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 13 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.
కరీంనగర్ సాహెత్నగర్లో నాలుగురికి, కిసాన్నగర్లో ముగ్గురికి, శివాజీనగర్లో ఒకరికి, సుభాష్నగర్లో ఒకరికి, కాపువాడలో ఒకరికి, హౌసింగ్బోర్డులో ఒకరికి, అశోక్నగర్లో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. సరస్వతీనగర్లో ముగ్గురికి, సిక్కువాడలో ఇద్దరికి, బోయవాడలో ఇద్దరికి, కట్టరాంపూర్లో ఎనిమిది మందికి, భగత్నగర్లో ఒకరికి, హరిహరనగర్లో ఒకరికి, రేకుర్తిలో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయింది. 14వ డివిజన్ మంకమ్మతోటలో ఇద్దరికి, 34వ డివిజన్ భగత్నగర్లో ఒకరికి, 35వ డివిజన్ శ్రీనగర్కాలనీలో ఒకరికి, 53వ డివిజన్ కశ్మీరుగడ్డలో ఒకరికి కొవిడ్ సోకినట్లు తెలిసింది.