‘కరోనా’ బాధితురాలికి మగశిశువు
ABN , First Publish Date - 2020-04-10T14:32:02+05:30 IST
‘కరోనా’ వైరస్తో బాధపడుతున్న మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది.
చెన్నై : తంజావూరు ‘కరోనా’ వైరస్తో బాధపడుతున్న మహిళ మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను వేర్వేరు వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తంజావూరు సుందరం నగర్కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలో జరిగిన మహానాడుకు హాజరై తిరిగొచ్చాడు. ఆయనతో పాటు కుటుంబసభ్యులను అధికారులు క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అతడితో పాటు అతని కోడలికి పరీక్షించగా కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. నిండు గర్భిణి అయిన ఆ మహిళకు బుధవారం నొప్పులు రావడంతో తంజా వూరులోని రాసామిరాసుదార్ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు సిజేరియన్ చేశారు.
ప్రసవం జరిగిన కొద్ది క్షణాల్లోనే తల్లి, బిడ్డను వేర్వేరు వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆ వార్డుల్లోకి ఎవరినీ అనుమతించకుండా పూర్తి బాడీ మాస్క్లు ధరించిన వైద్యులు, సిబ్బంది వారిని పర్యవేక్షిస్తున్నారు. శిశువు రక్తనమూనాలను ల్యాబ్కు పంపామని, ఫలితాల అనంతరం శిశువుకు కరోనా లక్షణాలున్నాయా..? లేవా..? అని నిర్ధారణ అవుతుందని వైద్యులు తెలిపారు.