కమనీయం.. కరోనా విహారం..

ABN , First Publish Date - 2020-06-28T18:18:16+05:30 IST

మనిషి రెక్కలున్న పక్షి. కరోనాతో కాళ్లూ చేతులూ కట్టేసినట్లుంది. ఎగరలేడు.. విహరించలేడు.

కమనీయం.. కరోనా విహారం..

మనిషి రెక్కలున్న పక్షి. కరోనాతో కాళ్లూ చేతులూ కట్టేసినట్లుంది. ఎగరలేడు.. విహరించలేడు. ఎన్నాళ్లిలా? అసలు సాధారణ పరిస్థితులు కనుచూపుమేర ఉన్నాయా? ఉంటే మళ్లీ పర్యాటకం ఎలా ఉండబోతోంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?.. 


ఏడాదికి మన దేశానికొచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కోటి.. మన దేశం నుంచీ విదేశాలకు వెళ్లే వాళ్లు 2.60 కోట్లు.. ఇక, స్వదేశంలోనే తిరిగే భారతీయ పర్యాటకులు 180 కోట్లు.. కేవలం చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు 8 లక్షలు.. వెరసి పర్యాటకరంగం విలువ సుమారు రూ.180 లక్షల కోట్ల మారకం.. అంటే జీడీపీలో ఆ రంగం వాటా 9.2 శాతం అన్నమాట. 


దేశవ్యాప్తంగా 53 వేల ట్రావెల్‌ ఏజెన్సీలు, లక్షా 15 వేల టూర్‌ ఆపరేటర్లు, 15 వేల అడ్వెంచర్‌ కంపెనీలు, 9 లక్షల 11 వేల పర్యాటక రవాణా సంస్థలు, 53 వేల ఆతిఽథ్య సేవా సంస్థలు, 5 లక్షల రెస్టారెంట్లు... అన్నిచోట్లా కలిపితే సుమారు 4.3 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. మరో నాలుగు కోట్ల మందికి పరోక్షంగా బతుకుదెరువు దొరుకుతోంది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఈ రంగాన్ని మంచం పట్టేలా చేసింది కరోనా. ఏడాదికి కోటి మంది కాదు కదా.. రానున్న రెండేళ్లలో కనీసం 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.


దూరప్రాంతాలకు వెళ్లలేకపోవడం, మాల్స్‌, థియేటర్లు ప్రారంభం కాకపోవడం వల్ల.. జలక్రీడలు, బోట్‌ రైడ్స్‌ ఆదరణకు నోచుకోనున్నాయి. దగ్గరలో ఉన్న బీచ్‌లకు కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. బోట్‌ పారాసైలింగ్‌, స్కూబా డైవింగ్‌, స్నోర్నలింగ్‌, కయకింగ్‌, అండర్‌ వాటర్‌ యాక్టివిటీస్‌లపై పర్యాటకులు ఆసక్తిచూపుతారు. ట్రెక్కింగ్‌, హైకింగ్‌, అడ్వెంచర్‌లకు అవకాశం ఉంటుంది.


‘సోలో’నే సో బెటరు..

దేశాలు, రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తిస్థాయి రాకపోకలు జరగడం లేదు. ఇలా ఎన్నాళ్లో ఊహించలేం. కాబట్టి ఇదివరకటిలా బృంద పర్యటనలు ఉండకపోవచ్చు. వీకెండ్‌ డ్రైవ్‌లపై ఆసక్తి చూపించవచ్చు. అత్యంత సన్నిహితులు అయితే తప్ప వెళ్లే పరిస్థితి ఉండదు. ఒంటరి పర్యటనలు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులపై వైరస్‌ ప్రభావం అధికం కాబట్టి.. వాళ్లు కొత్త ప్రాంతాలకు వెళ్లలేరు. అందులోనూ హోటళ్లు, ఎయిర్‌లైన్స్‌లలో కూడా వారిని నిరాకరించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యువత, నడివయస్కుల పర్యాటకులు పెరిగే వీలుంది. నేచర్‌, అడ్వెంచర్‌ క్యాంప్లింగ్‌, వైల్డ్‌ లైఫ్‌ డ్రైవ్‌లకు ఆదరణ లభించనుంది. సొంత టెంట్లు, వంట సరంజామా సిద్ధం చేసుకుని ప్రయాణాలకు యువత సిద్ధం కాబోతోంది. 


చుట్టాలింటికి వెళ్లొస్తాం

ఫ్యామిలీ టూరిజం అనేది పాతరోజుల్లోకి వెళ్లనుంది. ఇంటికి తాళం వేసి, ‘చుట్టాలింటికి వెళ్తున్నాం’ అని పక్కింటోళ్ళకి చెప్పి వెళ్లే ఒకానొకప్పటి రోజులు తిరిగి రానున్నాయి. ఎక్కడికో వెళ్లి హోటల్లో భయం భయంగా విడిది చేయడం కన్నా చుట్టాలింటికి వెళ్లి ప్రశాంతంగా గడపడం అనేది నమ్మకంతో కూడిన వ్యవహారం కానుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సొంత వాహనాల్లో బయల్దేరి తిరిగి వీలైనంత తక్కువ సమయంలో ఇంటికి చేరుకోడానికే ఇష్టపడతారు. లేదంటే నమ్మకమైన చోటే ఎక్కువ రోజులు విడిది చేయడానికి ఆసక్తి చూపుతారు. రోజుకో ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. రైలు, బస్సు, విమానాల్లో ప్రయాణించడానికి భయం పట్టుకున్న కారణంగా.. సొంత వాహనం లేని వారి సేవలో సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లకూ గిరాకీ పెరగనుంది.


సురక్షిత దేశాలకు ఓకే..

అంతర్జాతీయ బోర్డర్లు తెరుచుకోవడం అన్నది ఇప్పుడప్పుడే ఆశించే పరిణామం కాదు. ఒకవేళ ఓపెన్‌ అయినా .. ప్రయాణం సురక్షితం అన్న నమ్మకం కుదిరే వరకు.. ఎవరూ దేశం దాటి బయటికి వెళ్లే వీలు లేదు. వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదికి పైనే పడుతుందనుకున్నా.. అప్పటి వరకు అంతర్జాతీయ ప్రయాణం ఆదరణకు నోచుకోవడం అన్నది అసంభవం. ఎవరైనా వెళ్లేందుకు సిద్ధపడ్డా కూడా ఇప్పటి వరకు డిమాండ్‌ ఉన్న అమెరికా, యూరప్‌ దేశాలకు వెళ్ళడానికి అంత త్వరగా సాహసించే అవకాశం లేదు. చైనా వైపు అసలు చూడను కూడా చూడరు. శ్రీలంక, భూటాన్‌ వంటి దగ్గరగా ఉండే సురక్షితమైన దేశాలు పర్యటించడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.


కరోనా వీసాలొస్తాయ్‌..

విదేశీ ప్రయాణాలకు హెల్త్‌సర్టిఫికెట్లు తప్పనిసరి అవ్వొచ్చు. కరోనా లేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు వీసా కోసం వారు ఆమోదించిన పరీక్షా కేంద్రాల్లో ఆరోగ్య పరీక్ష చేసుకోవాల్సిందే. వారి దేశంలో ఉండగా కరోనా సోకితే అక్కడ చికిత్సకు, క్వారంటైన్‌కు అవసరమయ్యే ఖర్చులను లేదా భారీ మొత్తంతో చేయించుకున్న ఇన్స్యూరెన్స్‌ను కూడా ముందుగా చూపించాల్సి రావొచ్చు. ఒకవేళ కరోనా వల్ల చనిపోతే, మృతదేహాన్ని స్వదేశం తరలించడం ప్రయాస. కాబట్టి అక్కడే దహన సంస్కారాలకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. కొంత కాలానికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు సర్టిఫికేట్‌ లేదా డిక్లరేషన్‌ ఇవ్వక తప్పదు.


ఛార్జీల్లో విమానం మోత 

మాస్క్‌ లేకుండా ఎయిర్‌పోర్టులోకి, విమానంలోకి అనుమతించరు. ఇన్ర్ఫారెడ్‌ థర్మామీటర్లతో ఉష్ణోగ్రత చూస్తారు. ఇంతకుముందులా పొడుగైన చెకిన్‌ క్యూలు కనిపించవు. ఒక చెకిన్‌ బ్యాగుని మాత్రమే అనుమతిస్తారు. ఆన్లైన్‌ చెకిన్‌ ఉంటుంది. విమానంలో ఆహార సరఫరా ఉండదు. అత్యవసరమైతే తప్ప మంచినీరు కూడా ఇవ్వరు. సీటు వెనుక కవర్లో ఉండే పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, లీఫ్లెట్లు లేవిప్పుడు. వాటి స్థానంలో డిస్పోజబుల్‌ గ్లోవ్స్‌, శానిటేషన్‌ టిష్యులు ఉండే అవకాశం ఉంది. విమానంలో సోషల్‌ డిస్టెన్స్‌ ఏర్పాట్లు, ఇతర అదనపు సౌకర్యాల కల్పన నేపథ్యంలో దాదాపు 50 శాతం విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉంది.


ఆ బఫెలు జ్ఞాపకాలే.. 

కరోనా కొలిమి చల్లారకపోతే హోటళ్లలో బఫె, బ్రేక్ఫాస్ట్‌ ఒక చరిత్రగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి హోటల్లో దినవారీ శానిటైజేషన్‌ తప్పనిసరి కానుంది. చెక్‌ ఇన్‌ విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. హోటల్‌ లాబీలో ఎవరూ ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. చెకిన్‌, చెకౌట్‌ వేళల్లో వెసులుబాట్లు ఇస్తారు. రిసెప్షన్‌లో పని లేకుండా ఆన్లైన్‌ చెకిన్‌ విధానం అమల్లోకి రావచ్చు. తాళం చెవులు లేదా డిజిటల్‌ కార్డులతో పనిలేకుండా రూమ్‌ తెరవడానికి, మూయడానికి యాప్‌ ఆధారిత ఆధునిక విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  


ప్రైవేట్‌ హోమ్స్‌కు గిరాకీ.. 

పర్యాటకుడు.. కొంత ఖర్చు ఎక్కువైనా నాలుగు లేదా అయిదు నక్షత్రాల హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తాడు. బ్రాండెడ్‌ హోటళ్లలో కావలసిన భద్రత లభిస్తుందన్న ధీమా లభిస్తుంది కాబట్టి. వారిని ఆకట్టుకునేందుకు స్టార్‌ హోటళ్లు కూడా ధరలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. అలాగే కిచెన్‌, వంట సామానుతో సహా అన్ని సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్లు, విల్లాలు, ప్రయివేటు హోమ్స్‌కి ప్రాధాన్యత పెరగనుంది. జనావాసాలకు, నగర రద్దీకి దూరంగా ఉండే రిసార్టులకి కూడా ఆదరణ లభించవచ్చు. హోటళ్లు, గెస్టుహౌసులతో పాటు ఆతిథ్య సేవలో కొత్తగా ఖాళీ స్థలాలు అద్దెకు ఇవ్వడం అనే విధానం ట్రెండ్‌ సృష్టించవచ్చు.   

- నందం విష్ణువర్ధన్‌, 80089 86000

Updated Date - 2020-06-28T18:18:16+05:30 IST