క్వారంటైన్ నుంచి కోవిడ్ రోగులకు ఆన్‌లైన్‌లో చికిత్స అందిస్తున్న ప్రొఫెసర్

ABN , First Publish Date - 2020-06-02T02:08:28+05:30 IST

తనకు కరోనా సోకి క్వారంటైన్‌లో ఉంటున్నప్పటికీ విధి నిర్వహణను మాత్రం మర్చిపోలేదా ప్రొఫెసర్. ఆయన

క్వారంటైన్ నుంచి కోవిడ్ రోగులకు ఆన్‌లైన్‌లో చికిత్స అందిస్తున్న ప్రొఫెసర్

న్యూఢిల్లీ: తనకు కరోనా సోకి క్వారంటైన్‌లో ఉంటున్నప్పటికీ విధి నిర్వహణను మాత్రం మర్చిపోలేదా ప్రొఫెసర్. ఆయన మరెవరో కాదు.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ (జేఎన్ఎంసీ)లోని టీబీ, చెస్ట్ డిసీజెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మహమ్మద్ షమీమ్. కరోనా బారినపడిన ఆయన ప్రస్తుతం తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. అయినప్పటికీ టెలీమెడిసిన్ ద్వారా జేఎన్ఎంసీ హెల్త్ కేర్ సిబ్బంది సహాయంతో ఐసోలేషన్ వార్డు, రెస్పిరేటరీ వార్డులలోని నాన్-కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.  


‘‘ఇప్పుడు విపత్తు నుంచి బయటపడడం ఎంతో ముఖ్యం. క్వారంటైన్‌లో ఉన్న వైద్యులు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, టెలిఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా రోగులను సంప్రదించవచ్చని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని ప్రొఫెసర్ షమీమ్ పేర్కొన్నారు. వైరస్ సంక్రమణ భయం ఎప్పుడూ ఉంటుందని, అయితే గ్లోబల్ మెడికల్ ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వైద్యుడిగా తాను ప్రతికూల ఆలోచనలను అరికట్టాల్సి ఉంటుందని, మానవత్వంతో సేవలను కొనసాగించాల్సి ఉంటుందని షమీమ్ అన్నారు.


‘‘ఇప్పుడున్న ఒత్తిడిని దేనితోనూ పోల్చలేం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న చాలామంది రోగులు తమ చివరి క్షణాల్లో మాత్రమే వైద్యులు, నర్సులను చూస్తారు. వైద్యులు కరోనా బారినపడినప్పటికీ ఇలాంటి వారిని వారి మానాన వారిని వదిలివేయడం సముచితం కాదు’’ అని ప్రొఫెసర్ షమీమ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-02T02:08:28+05:30 IST