కార్పొరేషన్ల పగ్గాలు.. కృష్ణా జిల్లాలో ఐదుగురికి..
ABN , First Publish Date - 2020-10-01T16:20:55+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో జిల్లాకు..
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తోలేటి శ్రీకాంత్
సగర కార్పొరేషన్కు కర్నాటి రమాదేవి
గౌడ కార్పొరేషన్కు మధు శివరామకృష్ణ
వడ్డెర కార్పొరేషన్కు సైదు గాయత్రి
భట్రాజు కార్పొరేషన్కు కూరపాటి గీతాంజలి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో జిల్లాకు చెందిన ఐదుగురికి చోటు దక్కింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తోలేటి శ్రీకాంత్ను నియమించగా, సగర కార్పొరేషన్ చైర్మన్గా కర్నాటి రమాదేవి, గౌడ కార్పొరేషన్ చైర్మన్గా మధు శివరామకృష్ణ, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా సైదు గాయత్రి, భట్రాజు కార్పొరేషన్ చైర్మన్గా కూరపాటి గీతాంజలి నియమితుల య్యారు. వీరంతా వైసీపీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్నవారే. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తోలేటి శ్రీకాంత్ వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. తొలి నుంచి వైఎస్సార్ అభిమానిగా ఉంటూ కాంగ్రెస్ యువజన విభాగంలోనూ పలు పదవులు నిర్వహించారు.
సగర కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించనున్న కర్నాటి రమాదేవి విజయవాడ నగర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కర్నాటి రాంబాబు సతీమణి. రాంబాబు రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీగా, సగర సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భట్రాజు కార్పొరేషన్ చైర్మన్ కూరపాటి గీతాంజలి విజయవాడలో సత్యసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈమె భర్త కోటంరాజు వైసీపీలో చురుగ్గా ఉన్నారు. రాష్ట్ర భట్రాజు సంఘ అధ్యక్షుడిగా ఉన్నారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాదు శివరామకృష్ణది గన్నవరం నియోజకవర్గం. జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్ విభాగానికి అధ్యక్షుడు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సైదు గాయత్రి కైకలూరు నియోజకవర్గానికి చెందినవారు.