కోవిడ్తో కవల సోదరులు కన్నుమూత!
ABN , First Publish Date - 2021-05-18T17:54:16+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా పలు అందమైన జీవితాలు...
మీరఠ్: కరోనా మహమ్మారి కారణంగా పలు అందమైన జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇదేకోవలో ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన రాఫెల్ కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ, ఆల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ అనే ఇద్దరు కవల సోదరుల కోవిడ్ కారణంగా అర్థాంతరంగా తనువు చాలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ 24 ఏళ్ల కవల సోదరులు కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. ఈ కవల సోదరులు 1997 ఏప్రిల్ 23న జన్మించారు.
గత ఏప్రిల్ 24న వీరిరువురూ కరోనా బారినపడ్డారు. వీరి తండ్రి గ్రెగొరీ రేమండ్ రాఫెల్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారులు హైదరాబాద్లో పనిచేసేవారని... ఎప్పుడైనా సరే ఇద్దరూ కలిసే ఇంటికి వచ్చేవారని తెలిపారు. ఒకరికి ఏమి జరిగినా మరొకరికి జరిగేదని, వారు పుట్టినప్పటి నుండి ఒకరికొకరు ప్రాణంగా బతికారన్నారు. జోఫ్రెడ్ మరణవార్త విన్న తరువాత, ఆల్ఫ్రెడ్ ఒక్కడే ఒంటరిగా ఇంటికి తిరిగి రాడని తన భార్యకు చెప్పానన్నారు. రాఫెల్కు ముగ్గురు కుమారులు. వీరి కుటుంబమంతా కరోనా బారిన పడింది. అయితే కవల సోదరులకు ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.