బడిలో కొవిడ్ బెల్స్
ABN , First Publish Date - 2021-09-05T07:17:47+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఒకే రోజు 20 మందికి వైరస్
వారిలో 16 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లు
ఆందోళనలో తల్లిదండ్రులు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 4 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులూ వైరస్ బారిన పడుతున్నారు. శనివారం మరో 20 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 16 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈనెల 1,2 తేదీల్లో కనిష్ఠంగా నలుగురికి మాత్రమే కొవిడ్ ఉన్నట్లు తేలింది. శుక్రవారం ఆ సంఖ్య 10కి చేరింది. శనివారం రెట్టింపైంది. తాజా కేసుల్లో ఒక్కో పాఠశాలలో మూడు, నాలుగు ఉన్నాయి. మద్దిపాడు మండలం నేలటూరు ఎంపీయూపీ స్కూల్లో నలుగురికి, ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్లో నలుగురికి, కొండపి మండలం పెట్లూరు జడ్పీ హైస్కూల్లో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పొన్నలూరు మండలం విప్పగుంట ఎంపీపీపీఎస్లో ఒకరికి, పి.అగ్రహారం ఎంపీపీ స్కూల్లో నలుగురు, నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం ఎంపీపీ స్కూలులో ఒకరు, హెచ్.నిడమలూరు ఎయిడెడ్స్కూలులో ఒకరు, కనిగిరి మొదటి వార్డు ఎంపీపీ స్కూల్లో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
మరో 152 పాజిటివ్ కేసులు
ఒంగోలు (కార్పొరేషన్/కలెక్టరేట్), సెప్టెంబరు 4 : జిల్లాలో శనివారం కొత్తగా 152 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,34,180కి చేరింది. వీరిలో 1053 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా శనివారంకొత్తగా రెండు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ 284 మంది ఫంగస్ బారిన పడగా 188మంది కోలుకున్నారు. 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం రిమ్స్లో 15 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగిలిన వారు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జిల్లాలో శనివారం 12 కేంద్రాల్లో 1345మందికి కరోనా టీకా వేశారు.