మరణ మృదంగం

ABN , First Publish Date - 2021-05-05T06:05:21+05:30 IST

జిల్లాలో కరోనా కకావికలం సృష్టిస్తోంది. కొవిడ్‌ కాటుకు మంగళవారం 12 మంది మృత్యువు పాలయ్యారు.

మరణ మృదంగం
సత్రంపాడులో సూపర్‌ శానిటేషన్‌

ఒకే రోజు 12 మంది కరోనాకు బలి

పిట్టల్లా రాలిపోతున్న బాధితులు

జిల్లాలో 1258 పాజిటివ్‌ కేసులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 4 : జిల్లాలో కరోనా కకావికలం సృష్టిస్తోంది. కొవిడ్‌ కాటుకు మంగళవారం 12 మంది మృత్యువు పాలయ్యారు. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలో 1,258 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, చికిత్స పొందుతున్న బాధితులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,669కి ఎగబాకింది. అత్యధికంగా భీమవరం, అత్తిలి, చింతలపూడి, దెందులూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, కామవరపుకోట, నరసాపురం, పాలకొల్లు, పెదపాడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పెనుమంట్ర, తాళ్లపూడి, వీరవాసరం, తణుకు, పాలకోడేరు, దేవరపల్లి, ఏలూరులలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో కొత్తగా 52చోట్ల కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు కానున్నాయి.


ఒకే రోజు తల్లీ కొడుకుల మృతి

పెంటపాడు, మే 4 : కరోనా మహమ్మారి ఒకేరోజు తల్లీ కొడుకుల ప్రాణాలను కబలించింది.  కరోనాతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కొడుకు మృతి చెందగా, అదేరోజు సాయంత్రం తల్లి మరణించింది. యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి, కె.పెంటపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వి.విజయకుమార్‌ (43) కరోనా లక్షణాలతో వారం క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతిచెందారు. ఆమె తల్లి వీ.కెంపురత్నం(75)కు కూడా వ్యాధి లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. ఆమె కూడా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఒకేరోజు తల్లికొడుకులు ఇలా మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇటీవల మండలంలో జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలలో రిసోర్స్‌ పర్సన్‌గా సేవలందించారు. టీచర్‌ ఎంఎల్‌సీ షేక్‌ సాబ్జీ, మండల ప్రత్యేకాధికారి సాజా నాయక్‌,  ఎంపీడీవో డి.దామోదర్‌రావు, ఎంఈవో శ్రీనివాస్‌, ఉపాద్యాయ సంఘ నాయకులు, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.


పలువురిని కాటేసిన కరోనా..

ఆకివీడు/పాలకొల్లు టౌన్‌/దేవరపల్లి/మొగల్తూరు,  మే 4 : భీమవరం ప్రభుత్వాస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఆకివీడు ఐఎఫ్‌టీయూ మండల కార్యదర్శి శీలబోయిన రాఘవులు మృతి చెందినట్లు పీహెచ్‌సీ ఎంపీహెచ్‌ఈవో కె.సత్యనారాయణ తెలిపారు. పాలకొల్లు పురపాలక సంఘంలో టీపీవోగా పనిచేసి బదిలీపై విశాఖ వెళ్లిన ఎం.వెంకటరెడ్డి కరోనాతో అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన స్వగ్రామం పోడూరు మండలం కవిటం. దేవరపల్లికి చెందిన మహిళ (55) కరోనా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుష్మ తెలిపారు. తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్‌ సుష్మ తెలిపారు. మొగల్తూరుకు చెందిన భార్యాభర్తలకు పాజిటివ్‌ రావడంతో వారిని క్వారంటైన్‌కు రావాలని వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో తరలించేందుకు ప్రయత్నించారు. భార్య మాత్రమే క్వారంటైన్‌కు వెళ్లగా.. భర్త హోం క్వారంటైన్‌లో ఉన్నారు. చివరకు రాత్రి మృతి చెందాడు.



Updated Date - 2021-05-05T06:05:21+05:30 IST