వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం కట్
ABN , First Publish Date - 2021-12-03T14:49:37+05:30 IST
కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉద్యోగులు, సిబ్బందికి డిసెంబర్ నెల జీతాలు నిలిపివేస్తామంటూ మదురై మండల విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన సర్క్యులర్ ఆ శాఖలో కలకలం సృష్టించింది. ఆ ప్రకటన
- ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విద్యుత్ బోర్డు
- విమర్శలతో ఉత్తర్వుల ఉపసంహరణ
చెన్నై: కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉద్యోగులు, సిబ్బందికి డిసెంబర్ నెల జీతాలు నిలిపివేస్తామంటూ మదురై మండల విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన సర్క్యులర్ ఆ శాఖలో కలకలం సృష్టించింది. ఆ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడటంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 75 శాతానికి పైగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది రెండు విడతలు టీకాలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ వ్యాప్తి చెందే అవకాశం వుండటంతో మదురై జోన్ విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ ఈ నెల ఏడో తేదీలోగా ఉద్యోగులు, సిబ్బంది రెండు విడతల వ్యాక్సిన్ వేసుకోవాలని లేకుంటే డిసెంబర్ నెల జీతాలు నిలిపివేస్తామని సర్క్యులర్ జారీ చేశారు. ఈ విషయం సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడటంతో విద్యుత్ బోర్డు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందారు. మదురై జోన్ విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ సర్కులర్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విద్యుత్ బోర్డు చీప్ ఇంజనీర్ ఉమాదేవి టీకాలు వేసుకోనివారికి డిసెంబర్ నెల జీతాలు ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ గురు వారం సాయంత్రం మరో ప్రకటన చేశారు. ఉద్యోగులు సిబ్బంది తప్పని సరిగా కరోనా నిరోధక టీకాలు వేసుకోవాలనే భావనతోనే ఈ ప్రకటన చేసినట్టు సంజాయిషీ ఇచ్చుకున్నారు.