ఇజ్రాయెల్లో ఎలుకలపై కోవిడ్-19 వాక్సిన్ ప్రయోగాలు
ABN , First Publish Date - 2020-04-01T21:21:37+05:30 IST
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 మహమ్మారిని తిప్పి కొట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 మహమ్మారిని తిప్పి కొట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వైరస్ నిరోధానికి వాక్సిన్ను కనుగొనేందుకు విస్తృత పరిశోధన జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ఆ దేశ శాస్త్రవేత్తలు కోవిడ్-19 నిరోధక వాక్సిన్ను అభివృద్ధిపరచినట్లు తెలుస్తోంది. ఈ వాక్సిన్ను ఎలుకలపై ప్రయోగించినట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయొలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్)లో ఈ ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతం నెస్ సియోనాలో ఈ సంస్థ ఉంది.
ఐఐబీఆర్ డైరెక్టర్ ష్ముయెల్ షపిరా ఈ వాక్సిన్ గురించి ప్రధాని నెతన్యాహుకు తెలిపిన వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాక్సిన్ ప్రోటోటైప్నున రూపొందించడంలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించినట్లు షపిరా తెలిపినట్లు పేర్కొంది. జంతువులపై ప్రయోగం చేసేందుకు ఓ మోడల్ను తయారు చేసినట్లు షపిరా తెలిపినట్లు వివరించింది.
ఇదిలావుండగా, ఓ విదేశీ వార్తా సంస్థకు ఐఐబీఆర్ కార్యకలాపాల గురించి తెలిసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ కోవిడ్-19 నిరోధక వాక్సిన్ ప్రయోగ దశలో ఉందని, ఇప్పటికే దీనిని ఎలుకలపై ప్రయోగించి, పరీక్షిస్తున్నారని తెలిపారు.
ఐఐబీఆర్లో జీవ సంబంధ, రసాయన ఆయుధాలు తయారవుతాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పందించడం లేదు.
ఇజ్రాయెల్లో 4,473 కోవిడ్-19 కేసులు నమోదు కాగా, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అష్ట దిగ్బంధనం అమలు చేయడంపై నెతన్యాహు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా, కరోనా వైరస్ జంతువులకు సోకదని, జంతువులపై ఈ వాక్సిన్ను ప్రయోగించి, పరీక్షించడం ఓ సవాలు అని కొందరు చెప్తున్నారు.