షెల్టర్లను పరిశీలిస్తున్న సీపీ ఆర్కే మీనా

ABN , First Publish Date - 2020-03-30T10:32:26+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో రోడ్లపై తిరిగే యాచకులు, గూడులేని ఆపన్నుల కోసం జీవీఎంసీ, పోలీస్‌ శాఖ సంయుక్తంగా ఐదు చోట్ల తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేశాయి. వీ

షెల్టర్లను పరిశీలిస్తున్న సీపీ ఆర్కే మీనా

ఆపన్నుల కోసం తాత్కాలిక శిబిరాలు



విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో రోడ్లపై తిరిగే యాచకులు, గూడులేని ఆపన్నుల కోసం జీవీఎంసీ, పోలీస్‌ శాఖ సంయుక్తంగా ఐదు చోట్ల తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేశాయి. వీటిని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కేమీనా ఆదివారం ప్రారంభించారు. ఒక్కో శిబిరంలో వంద మందికి ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేశారు.  రైల్వేన్యూకాలనీలోని సుబ్బలక్ష్మి కల్యాణమండపం, స్వామివివేకానంద కల్యాణమండపం, ఆశీల్‌మెట్టలోని వేమనమందిరం, ఎంవీపీకాలనీలో గిరిజన వసతి గృహం, వేపగుంటలోని వైటీసీలో వంద పడకలు చొప్పున ఏర్పాటుచేశారు. అక్కడ ఆశ్రయం పొందేవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందజేస్తారు.


స్నానాలు చేసుకునేందుకు బాత్‌రూమ్‌లు, నిద్రపోయేందుకు పరుపులు, దుప్పట్లను కూడా అందజేస్తారు. వీటి నిర్వహణ పక్కాగా ఉండేందుకు వీలుగా ఒక్కో సెంటర్‌కు ప్రత్యేక అధికారులు ఇద్దరు, కిందిస్థాయిలో ఎనిమిది గంటల పాటు విధులు నిర్వర్తించేలా జీవీఎంసీ, పోలీస్‌ సిబ్బందిని నియమించారు. వీటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, వలస కూలీలు చిక్కుకుపోయినా, రోడ్లపై ఆపన్నులు, యాచకులు కనిపించినా జీవీఎంసీ యూసీడీ పీడీ వై.శ్రీనివాసరావు లేదా డీఎంసీ వి.నాగరాజు(9848308818), సీఐ రెడ్డి శ్రీనివాసరావు(9704655116)ను సంప్రదించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన కోరారు.

Updated Date - 2020-03-30T10:32:26+05:30 IST