క‌రోనా మృతుని ఏటీఎం కార్డు చోరీ.... 1.6 ల‌క్ష‌లు మాయం

ABN , First Publish Date - 2021-06-17T19:04:34+05:30 IST

బీహార్‌లోని ససారాం జిల్లాలో షాకింగ్ సంఘటన...

క‌రోనా మృతుని ఏటీఎం కార్డు చోరీ.... 1.6 ల‌క్ష‌లు మాయం

స‌సారాం: బీహార్‌లోని ససారాం జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. క‌రోనాతో మృత్యువాత‌ప‌డిన‌ స్కూల్ గుమస్తాకు చెందిన‌ ఏటీఎం కార్డులో నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు మాయ‌మ‌య్యాయి. ఆ గుమాస్తాకు అంత్య‌క్రియలు నిర్వ‌హించిన డెహ్రీ మునిసిపాలిటీ ఉద్యోగులు మృతుని ఏటీఎం కార్డు చోరీ చేసి, ఆ ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బును ఉపసంహరించుకున్నారు. మృతుని భార్య దీనిని గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


డిఎవి స్కూల్‌లో గుమాస్తాగా ప‌నిచేస్తున్న‌ అభిమన్యు కుమార్ క‌రోనా బారిన‌ప‌డి, ఏప్రిల్ 30 న డెహ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి, అతని మృతదేహాన్ని డెహ్రీ మునిసిపల్ కౌన్సిల్ ఉద్యోగులు దహనం చేశారు. భర్త మరణించిన తరువాత అత‌ని ఖాతా నుంచి రూ.1,06,500 ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసిన‌ట్లు మృతుని భార్య ఛాయా దేవి గుర్తించారు. ఆమె దరిహాట్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి ఈ కేసు పరిష్కారానికి డెహ్రీ ఎస్‌డీపీవో సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో ముందుగా శ్మశానవాటిక నిర్వాహ‌క సభ్యుడు విశాల్ డోమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం దగ్గరున్న‌ ఏటీఎం కార్డును దొంగిలించి, అంత్య‌క్రియ‌ల‌కు ముందు మృతుడి ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నట్లు విశాల్ ఒప్పుకున్నాడు. ఈ ఉదంతంలో త‌న‌కు స‌హ‌క‌రించిన‌వారి పేర్లను కూడా ఆయన పోలీసుల ముందు వెల్లడించాడు. దీంతో వారిని అరెస్టు చేసి, డబ్బును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

Updated Date - 2021-06-17T19:04:34+05:30 IST