రైతులకు కేటాయించిన భూముల్లో సాగు చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-06-23T05:47:40+05:30 IST
రైతులకు కేటాయించిన భూముల్లోనే సాగు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ భూములను పాడేరు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతితో కలిసి జేసీ పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి
అరకులోయ, జూన్ 22: రైతులకు కేటాయించిన భూముల్లోనే సాగు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ భూములను పాడేరు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతితో కలిసి జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తభల్లుగుడ పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారికి ఆనుకొని 72,73 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 95 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి స్థితిగతులను తహసీల్దార్ శ్యాంప్రసాద్, పాడేరు డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులు జేసీతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తాము ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నామని చెప్పారు. దీనిపై జేసీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు కేటాయించిన భూముల్లో మాత్రమే సాగు చేసుకోవాలని, ప్రభుత్వ భూముల్లో ఎలా సాగు చేస్తారన్నారని రైతులను ప్రశ్నించారు. రైతులు, గ్రామస్థులకు ఉపయోగపడే పనులకే ఈ భూములను వినియోగిస్తామన్నారు. అంతకుముందు బొండాం పంచాయతీ పరిధిలోని మజ్జివలస సర్వే నెంబర్ 54లో ఏకలవ్య గురుకుల స్కూలు నిర్మాణానికి కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలను తహసీల్దార్ శ్యాంప్రసాద్ వివరించారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.