నేటి నుంచి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-05T06:37:49+05:30 IST

కరోనా ఉధృతి నియంత్రణ కోసం ప్రభుత్వం బుధవారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.

నేటి నుంచి కర్ఫ్యూ
కొనుగోలుదారులు లేక మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బోసిపోతున్న ఒంగోలులోని బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌

మధ్యాహ్నం వరకే అనుమతి

12గంటల తర్వాత అంతా బంద్‌

జనసంచారం, రవాణా నిలిపివేత

అత్యవసరాలకు మినహాయింపు

ఒంగోలు, మే 4 (ఆంధ్రజ్యోతి) : కరోనా ఉధృతి నియంత్రణ కోసం ప్రభుత్వం బుధవారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. జిల్లా అంతటా ఇప్పటివరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకూ ఒక్కోచోట ఒక్కో రకంగా ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రోజుకు 18గంటల పాటు కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే దుకాణాలు, వివిధ రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను అనుమతిస్తారు. ఆతర్వాత అన్నింటినీ తిరిగి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించగా తదనుగుణంగా అమలుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత జన సంచారాన్ని నిషేధించనున్నారు. కేవలం వైద్యం, కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా ఇతరత్రా అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపులు ఇవ్వనున్నారు. దీంతో అన్నిరకాల కార్యకలాపాలు రెండు వారాల పాటు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నిత్యావసరాల లభ్యత, పంపిణీ ఇతరత్రా చర్యలపై జేసీ వెంకటమురళి రెవెన్యూ, పోలీస్‌, పౌరసరఫరా తదితర శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్షించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు నిత్యావసరాల ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


Updated Date - 2021-05-05T06:37:49+05:30 IST