మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ.
ABN , First Publish Date - 2020-11-22T09:42:49+05:30 IST
పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి
వడోదర, రాజ్కోట్, సూరత్, భోపాల్, గ్వాలియర్, ఇండోర్ల్లో రాత్రి విధింపు
మరో 46,232 కరోనా కేసులు 564 మంది మృతి
న్యూఢిల్లీ, నవంబరు 21: పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. గుజరాత్లోని రాజ్కోట్, సూరత్, వడోదర నగరాల్లో శనివారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అయితే, కర్ఫ్యూ ఎప్పటివరకు అనేది స్పష్టం చేయలేదు. రాజధాని అహ్మదాబాద్లో శుక్రవారం రాత్రి నుంచే కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సహా ఇండోర్, గ్వాలియర్, విదిశ, రత్లాం జిల్లాల్లోనూ శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ముంబైలో స్కూళ్లను డిసెంబరు 31 వరకు తెరవొద్దని నిర్ణయించారు. మహారాష్ట్రలోని థానె, నవీ ముంబై, పన్వేల్లోనూ ఇదే నిర్ణ యం అమలుకానుంది. మిగతా ప్రాంతాల్లో తెరిచేందుకు అనుమతిచ్చినా తప్పనిసరి కాదని ప్రకటించారు. కాగా, ముంబైకి ఢిల్లీ నుంచి విమానాలు, రైళ్ల సర్వీసులు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పరిస్థితిని బట్టి బడులు తెరవాలా? వద్దా? అని నిర్ణయించుకోమని గుజరాత్, హరియాణ, మణిపూర్ ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలిచ్చాయి. ఉత్తర ప్రదేశ్లో సెకండ్వేవ్ మొదలైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఉత్త ర భారతంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్లు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మరోవైపు శుక్రవారం 10.66 లక్షల పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 13 కోట్లు దాటింది. దేశంలో కొత్తగా 46,232 మందికి పాజిటివ్ రాగా, 564 మంది మృతి చెందారు. 4.39 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని, 49,715 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది. యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువన ఉండటం ఇది వరుసగా 11వ రోజు. ఢిల్లీలో కరోనాతో తాజాగా 118 మంది మృతిచెందారు. 6,608 మందికి వైరస్ సోకింది. హరియాణ (3,104)లో తొలిసారి 3 వేల కేసులు వచ్చాయి. రాజస్థాన్ (2,762)లో అత్యధిక పాజిటివ్లు నమోదయ్యాయి. గుజరాత్ (1,420)లో సెప్టెంబరు 25 తర్వాత, మధ్యప్రదేశ్ (1,528)లో అక్టోబరు 14 తర్వాత భారీ కేసులు వచ్చాయి. కరోనాతో అస్వస్థతకు గురైన అసోం మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ (86) పరిస్థితి మరింత విషమించింది. గొగోయ్ 20 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఉన్న లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్న 33మంది సివిల్ సర్వీసెస్ అధికారులకు పాజిటివ్ వచ్చింది. ప్రయాణికుల్లో కొందరికి పాజిటివ్ రావడంతో ఎయిరిండియా విమానాల రాకను హాంకాంగ్ ప్రభుత్వం డిసెంబరు 3వ తేదీ వరకు రద్దు చేసింది.