పీటీడీకి తుఫాన్‌ దెబ్బ

ABN , First Publish Date - 2021-09-29T06:32:55+05:30 IST

ప్రజా రవాణా శాఖ(పీటీడీ/ఆర్టీసీ) విశాఖ రీజియన్‌కు తుఫాన్‌ దెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురియడంతో పీటీడీ బస్సుల ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పీటీడీకి తుఫాన్‌ దెబ్బ

400 బస్సుల రద్దు

రూ.65 లక్షల ఆదాయానికి గండి

ద్వారకాంప్లెక్సు, సెప్టెంబరు 28 : ప్రజా రవాణా శాఖ(పీటీడీ/ఆర్టీసీ) విశాఖ రీజియన్‌కు తుఫాన్‌ దెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురియడంతో పీటీడీ బస్సుల ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జ్ఞానాపురం బ్రిడ్జి దగ్గర, హనుమంతువాక దగ్గర నీరు నిలిచిపోవడం, యారాడకు వెళ్లే రోడ్డులో కొన్ని చోట్ల రోడ్డు పాడవ్వడంతో ఈ రూట్లలో వెళ్లాల్సిన బస్సులను రద్దు చేశారు.  విశాఖ రీజియన్‌లో 1,051 బస్సులు ఉండగా అందులో వివిధ రూట్లకు సంబంధించి 400 బస్సులు రద్దు చేశారు. విశాఖ సిటీ, జిల్లా, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అన్ని రూట్లలో కలిపి 651 బస్సులు ఆపరేట్‌ చేశారు. భారీ వర్షం, ప్రయాణికుల డిమాండ్‌ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రజా రవాణాకు వినియోగించే బస్సుల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని  రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం వెల్లడించారు. రోజూవారీ  సగటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) 72 శాతం కాగా, 40శాతం మాత్రమే వచ్చినట్టు అధికారులు లెక్కలు కట్టారు.  రోజువారీ ఆదాయం విషయానికి వస్తే రోజుకు రూ.1.05  కోట్లు వచ్చేది. కానీ మంగళవారం  రూ.45 లక్షలు మాత్రమే వచ్చింది.  


Updated Date - 2021-09-29T06:32:55+05:30 IST