జ్ఞానప్రదాయినీ!

ABN , First Publish Date - 2021-10-13T06:24:23+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం అమ్మవారు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

జ్ఞానప్రదాయినీ!
సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ఆరో రోజు సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్‌ 

మూలా నక్షత్రం కావడంతో లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం 

రాత్రి 12 గంటల వరకు కొనసాగిన రద్దీ


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం అమ్మవారు జ్ఞానప్రదాయిని సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ధవళ వర్ణ వస్త్రాల్లో వీణా పుస్తకధారిణియైున అమ్మవారిని గుండెల నిండా నింపుకుని భక్తులు వెనుదిరిగారు. అమ్మవారి జన్మనక్షత్రం కూడా కావడంతో సోమవారం అర్ధరాత్రి నుంచే భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. రాత్రి 12 గంటల వరకూ దర్శనానికి అనుమతించడంతో అప్పటి వరకూ రద్దీ కొనసాగుతూనే ఉంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఇంద్రకీలాద్రి పులకించింది..  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం శ్వేతపద్మాన్ని అధిష్ఠించిన అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. బంగారు వీణ, దండ, కమండలాలను ధరించి, చిరు దరహాసం.. అభయ ముద్రతో భక్తులను అనుగ్రహించింది. 

ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో వచ్చే ఆశ్వయుజ శుద్ధ సప్తమి అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉండటంతో ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి జగన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారి కటాక్షం పొందేందుకు సామాన్య భక్తులు మొదలుకుని ప్రముఖుల వరకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల నుంచే దర్శనాలకు అనుమతించారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకూ భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతూనే ఉన్నాయి. లక్షన్నరకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించున్నారు. వీవీఐపీ-ప్రొటోకాల్‌ దర్శనాలను అధికారులు నిలువరిండంతో భక్తులు వేగంగా దర్శనాలు చేసుకోగలిగారు. సుదూర ప్రాంతాల నుంచి సోమవారం రాత్రి పది గంటల నుంచే భక్తులు వెల్లువెత్తారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనానికి అనుమతించడంతో అప్పటి వరకూ వారు ఉండేందుకు వీలుగా అధికారులు వీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి రెండు గంటలకు దర్శనానికి అనుమతించిన వెంటనే ఒక్కసారిగా భక్తులు క్యూలైన్ల లోకి ప్రవేశించడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. 


విశేష అర్చనలకూ అధిక సంఖ్యలో హాజరు

ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మహామండపంలోని ఆరో అంతస్థులో నిర్వహించిన విశేష కుంకుమార్చనలు, హోమశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించిన శతచండీహోమం, శ్రీచక్ర నవావర్ణార్చన తదితర ఆర్జిత పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ముగిసిన తర్వాత ప్రదోష కాలంలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ పల్లకీ సేవ కనులవిందుగా జరిపారు. బుధవారం దుర్గాష్టమి కావడంతో జగన్మాత నిజరూపమైన దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నది.


తెప్పోత్సవం లేనట్టే!

దసరా రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవం ఈ ఏడాది లేనట్టే. ప్రతి ఏడాదీ ప్రత్యేక హంస వాహనంపై గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది జలవనరుల శాఖ ఇందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నుంచి 1,60,290 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇన్‌ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున తెప్పోత్సవం నిర్వహించడం సురక్షితం కాదని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారని, ఈ ఏడాది దాదాపు తెప్పోత్సవం ఉండదని ఆ శాఖకు చెందిన ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.





Updated Date - 2021-10-13T06:24:23+05:30 IST