ఉచితాలు ఇచ్చి డబ్బు వృధా చేస్తున్నారు: ఢిల్లీ సీఎంపై హర్యానా సీఎం ఫైర్

ABN , First Publish Date - 2021-12-31T22:29:10+05:30 IST

ఢిల్లీ ఆర్థికంగా బాగానే ఉంది. అయితే మేం ఢిల్లీ కంటే కూడా మెరుగ్గా ఉన్నాం. హర్యానాలో మేం ఎవరికీ ఉచితాలు ఇవ్వడం లేదు. మా పౌరులను బాధ్యాతాయుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం..

ఉచితాలు ఇచ్చి డబ్బు వృధా చేస్తున్నారు: ఢిల్లీ సీఎంపై హర్యానా సీఎం ఫైర్

న్యూఢిల్లీ: ప్రజలకు ఉచితాలు ఇస్తూ డబ్బును ఢిల్లీ ప్రభుత్వం వృధా చేస్తోందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. వాస్తవానికి ఆర్థికరంగంలో తాము ఢిల్లీ ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉన్నామని, అయినప్పటికీ తమ ప్రజలను గౌరవంగా తీర్చి దిద్దేందుకు అలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని తెలిపారు. శుక్రవారం ఓ హిందీ పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్భుతమైన ప్రణాళిక ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ఆత్మనిర్భర్ హర్యానాను కొనసాగించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని ముందుకు సాగుతున్నాం. దీంతో రాష్ట్రాన్ని, దేశాన్ని ఆర్థికంగా మరింత బలంగా రూపొందించవచ్చు. ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, మౌళిక రంగాన్ని విస్తృతం చేయడం, ప్రభుత్వ సాధనాలను బలోపేతం చేయడం, జనాభాను నియంత్రించడం, పెట్టుబడులను ఆకట్టుకోవడం అనే ఐదు అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉంది’’ అని ఖట్టర్ అన్నారు.


ఇక ఢిల్లీ ఆర్థిక రంగం గురించి ప్రస్తావిస్తూ ‘‘ఢిల్లీ ఆర్థికంగా బాగానే ఉంది. అయితే మేం ఢిల్లీ కంటే కూడా మెరుగ్గా ఉన్నాం. హర్యానాలో మేం ఎవరికీ ఉచితాలు ఇవ్వడం లేదు. మా పౌరులను బాధ్యాతాయుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. అందుకు ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే 1,500 స్టార్ట్ అప్‌లకు అనుమతి ఇచ్చాం. మరో 4,000 స్టార్ట్ అప్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాల కంటే హర్యానా మెరుగ్గా ఉన్నాం’’ అని ఖట్టర్ అన్నారు.

Updated Date - 2021-12-31T22:29:10+05:30 IST