రైతాంగానికి ఏడాదంతా సంక్రాంతే
ABN , First Publish Date - 2020-05-27T09:53:42+05:30 IST
జగనన్న పాలనలో ఏడాదంతా రైతులకు సంక్రాంతే అని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు
ఉపముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా
కడప (కలెక్టరేట్), మే 26: జగనన్న పాలనలో ఏడాదంతా రైతులకు సంక్రాంతే అని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారని ఉపముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో తొలియేడు- జగనన్న తోడు, మన పాలన- మీసూచనపై, రెండోరోజు కలెక్టరేట్లోని స్పందన హాలులో కలెక్టర్ అధ్యక్షతన మేథోమదనం కార్యక్రమం, మనపాలన-మీసూచనలో వ్యవసాయ రంగాలు దాని అనుబంధ రంగాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమేకాక ప్రభుత్వ పథకాల అమలు కోసం మేథో మదనానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏడాది పాలనలో 90 శాతం హామీలు నెరవేర్చినట్లు తెలిపారు.
రైతుభరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ రైతులకు వెన్ను దన్నుగా ప్రభుత్వం నిలిచిందని, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన పంటలు నేరుగా ప్రభుత్వం మద్దతు ధరలకు కొనుగోలు చేయడం వల్ల వారికి మేలు జరుగుతోందన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు అత్యంత కీలకం కానున్నాయని, జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2012-13లో పెండింగ్లో ఉన్న రూ.120 కోట్ల బీమాను ఎంపీ అవినాష్రెడ్డి చొరవతో రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్రెడ్డి, డాక్టర్ సుధీర్రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, జేసీ గౌతమితో పాటు సాయికాంత్ వర్మ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.