ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కంపెనీల్లో వరుస ప్రమాదాలు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-07-14T18:34:14+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విశాఖలోని కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని..

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కంపెనీల్లో వరుస ప్రమాదాలు: దేవినేని ఉమా

మంగళగిరి (గుంటూరు జిల్లా):  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విశాఖలోని కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విశాఖలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే, ఎస్పీవై ఆగ్రోస్, రాంకీ సెజ్ ప్రమాదాలు జరిగేవి కాదన్నారు. ప్రభుత్వం కాపాడుతుందన్న ఉద్దేశం ఉండబట్టే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దల కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.


ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో కోటిరూపాయాలు ప్రకటించిన ప్రభుత్వం తరువాత ఎందుకు స్పందించలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరపడం ద్వారా ఏం జరిగినా రక్షిస్తామనే సంకేతాలు ఇచ్చారని, ప్రభుత్వ నిర్లక్షం వల్లే వరుస దుర్ఘటనలు జరిగాయన్నారు. ప్రమాద స్థలాన్ని సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి బండారును ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎస్పీవై, రాంకీ సెజ్‌లలో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కంపెనీల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. కరోనా పెద్దఎత్తున విజృంభిస్తున్నా, ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు. సున్నా వడ్డీ పథకం పేరును రైతుదగా పథకంగా మార్చుకోండన్నారు. రూ.లక్ష లోపు రుణానికి మాత్రమే సున్నావడ్డీ అమలు చేస్తూ, ఆ పైన రూ.100 దాటినా 7శాతం వడ్డీ వేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.


ఏడాది పాలనలో ప్రభుత్వం లక్షకోట్ల అప్పు చేసిందని దేవినేని ఉమా అన్నారు. ప్రభుత్వ భూముల అమ్ముతున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేదని  విమర్శించారు. నాబార్డ్, ఆర్బీఐ, విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా కాకుండా దేశం దాటి వేల కోట్ల ప్రైవేటు అప్పు ప్రయత్నాలలో మతలబేంటని ప్రశ్నంచారు. ఆ విదేశీ ట్రస్ట్ ఎవరిదని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర చట్టాల పరిధిదాటి ప్రభుత్వం అడుగుతున్న వేలకోట్లు అప్పెందుకో ప్రజలకు చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-14T18:34:14+05:30 IST