ధరల పెరుగుదలపై సీపీఎం నిరసన
ABN , First Publish Date - 2021-06-19T04:52:21+05:30 IST
ధరల పెరుగుదలను నిరసిస్తూ మండలంలోని నరుకూరు సెంటర్లో సీపీఎం ఆధ్యర్యంలో శుక్రవారం ఆందోళన జరిగింది.
తోటపల్లిగూడూరు, జూన్ 18 : ధరల పెరుగుదలను నిరసిస్తూ మండలంలోని నరుకూరు సెంటర్లో సీపీఎం ఆధ్యర్యంలో శుక్రవారం ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా మండలంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ధరల పెరుగుదలను నియంత్రించి ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతుండడం శోచనీయమని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెంచిన ధరలు తగ్గించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పావురాయల మధు, ఆటో యూనియన్ అధ్యక్ష్య, కారదర్శులు మారుబోయిన రాజా, కె.కృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన
వెంకటాచలం, జూన్ 18 : స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం, సీపీఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దారు ఐఎస్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజలందరూ ఇప్పటికే అన్ని విధాలుగా నష్టపోయారని, చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ప్రజల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ ఓడూరు వెంకటకృష్ణయ్య, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పడిగిపోగు కిరణ్ కిషోర్, నాయకులు షేక్ రసూల్, టీ వెంకయ్య, షేక్ రహంతుల్లా బాషా, షేక్ కరీముల్లా తదితరులున్నారు.