కలకలం రేపుతున్న అమిత్షా తాజా కామెంట్స్
ABN , First Publish Date - 2021-04-11T22:55:00+05:30 IST
ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూచ్బేహార్లో
కోల్కతా : ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూచ్బేహార్లో కాల్పుల తర్వాత ఇది తార స్థాయి చేరింది. కేంద్ర హోంమంత్రి ఆదివారం బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కూచ్బేహార్ ఘటన కంటే ముందు సీఎం మమత వీల్ఛైర్లో వచ్చి కేంద్ర బలగాలపై విరుచుకుపడాలని మహిళలను, యువతను ఉసిగొల్పారని మండిపడ్డారు. మమత కారణంగానే నలుగురు చనిపోయారని అమిత్షా తీవ్రంగా ధ్వజమెత్తారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్త కూడా మృతి చెందారని గుర్తు చేశారు. కూచ్బేహార్ కాల్పులకు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయాలని దీదీ పదే పదే డిమాండ్ చేయడంపై షా కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెబితే వారు రాజీనామా చేయమంటే తాను చేయనని, ప్రజలు అడిగితేనే హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. కానీ... మే 2 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి మాత్రం దీదీ సిద్ధంగా ఉండాలని షా చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లును ఇచ్చి, మమతకు వీడ్కోలు పలకాలని అమిత్షా పిలుపునిచ్చారు.