Pegasus వ్యవహారం.. రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-08-09T23:56:27+05:30 IST

దేశాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంపై రక్షణ మంత్రిత్వ శాఖ తొలిసారిగా స్పందించింది. ఈ స్పైవేర్ తయారీదారైన ఎన్ఎస్ఓ సంస్థతో తాము ఎటువంటి లావాదేవీలు జరపలేదని స్పష్టమైన ప్రకటన చేసింది.

Pegasus వ్యవహారం.. రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దేశాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న ‘పెగాసస్’ వ్యవహారంపై రక్షణ మంత్రిత్వ శాఖ తొలిసారిగా స్పందించింది. ఈ స్పైవేర్ తయారీదారైన ఎన్ఎస్ఓ సంస్థతో తాము ఎటువంటి లావాదేవీలు జరపలేదని స్పష్టమైన ప్రకటన చేసింది. రాజసభ్య సభ్యుడు, సీపీఎం నేత వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. పెగాసస్‌ను తయారు చేసిన ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్ఓతో ప్రభుత్వం లావాదేవీలు జరిపిందా..? అని డా. వి. శివదాసన్ ప్రశ్నించారు. దీనికి రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్పందిస్తూ..రక్షణ శాఖ ఎటువంటి లావాదేవీలు జరపలేదంటూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.


అయితే..ఈ విషయమై హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలో నిఘా అంశం ఉన్న విషయం తెలిసిందే. అంతకుమునుపు..పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పెగాసస్ వ్యవహారం చాలా ఆందోళనకరమైన విషయమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్‌సభలో పేర్కొన్నారు. ‘‘పెగాసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలు, జడ్జిలపై నిఘా పెట్టిందన్న వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు..ప్రభుత్వాలకు మాత్రమే తమ నిఘా సాఫ్ట్‌వేర్‌(పెగాసస్)ను ఇస్తామంటూ ఎన్‌ఎస్ఓ ప్రకటించింది. అంటే..ప్రభుత్వమే పెగాసస్‌ను వినియోగించిందన్న అర్థం వస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఐటీ చట్టం ప్రకారం.. ఈ తరహా నిఘాని హ్యాకింగ్‌గా వర్గీకరిస్తారు. మరోవైపు.. తనకు పెగాసస్‌తో సంబంధం లేదనే విస్పష్టమైన ప్రకటన ఏదీ కేంద్రం ఇప్పటివరకూ చేయలేదు. అందుకే ఈ విషయాన్ని నేను సభ దృష్టికి తెస్తున్నాను’’ అని మనీశ్ తివారీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-09T23:56:27+05:30 IST