డైట్‌ రైట్‌!

ABN , First Publish Date - 2020-02-23T07:25:43+05:30 IST

గార మండలం వమరవల్లిలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్‌).. విద్యాశిక్షణ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారనుంది. డైట్‌లను

డైట్‌ రైట్‌!

డైట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ 

ప్రిన్సిపాల్‌ ఆధీనంలో ఏఎంవో బృందం 

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ


(నరసన్నపేట)

గార మండలం వమరవల్లిలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్‌).. విద్యాశిక్షణ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారనుంది. డైట్‌లను మరింత బలోపేతం చేసి, పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాస్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలన్నీ ఇకపై డైట్‌ ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత కూడా ‘డైట్‌’లకు అప్పగించనుంది. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టులోని అకడమిక్‌ మానిటరింగ్‌, అసిస్టెంట్‌ మానిటరింగ్‌ అధికారులకు, డివిజనల్‌ స్థాయి మానిటరింగ్‌ బృందాలు కూడా డైట్‌ ప్రిన్సిపాల్‌ అధీనంలోనే పనిచేయాలని  పాఠశాల విద్య కమిషనర్‌  వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లా డైట్‌కు రూ.20లక్షల చొప్పున మంజూరు చేశారు.


ఇప్పటివరకూ ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాలన్నీ జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలను సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌(ఏపీసి), డీఈవో నుంచి తప్పించి డైట్‌ ప్రిన్సిపాల్‌కు అప్పగించారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారుల బృందం ఇక నుంచి డైట్‌ ప్రిన్సిపాల్‌  ఆధీనంలో పనిచేయనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్షలోని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ మానిటరింగ్‌ అధికారులు, డివిజనల్‌ స్థాయి మానిటరింగ్‌ బృందాలను ‘డైట్‌’తో అనుసంధానం చేశారు. 


రేపటి నుంచి మూడో విడత శిక్షణ 

ఆంగ్లమాధ్యమంలో బోధనపై ఉపాధ్యాయులు ఇచ్చే వృత్యంతర శిక్షణ తరగతులను డైట్‌ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. జిల్లాలో మూడు విడతలలో 5,862 మంది ఉపాధ్యాయులకు మండల కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. మూడో విడత ఈ నెల 24నుంచి ఐదురోజులుపాటు శిక్షణ ఇవ్వనున్నారు. డైట్‌ ప్రిన్సిపాల్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఉత్తర్వులు అందాయి ..సదాశివుని తిరుమల చైతన్య, డైట్‌ ప్రిన్సిపాల్‌, వమరవిల్లి 

జిల్లాలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను డైట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే  సమగ్ర శిక్ష ప్రాజెక్టులో మానటిరింగ్‌ అధికారులు బృందం అంతా డైట్‌ ప్రిన్సిపాల్‌ ఆధీనంలో ఉండేలా తాజాగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-02-23T07:25:43+05:30 IST