మద్యం షాపుల వద్ద నిబంధనలు బేఖాతరు
ABN , First Publish Date - 2020-08-13T10:22:48+05:30 IST
ఓవైపు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న మద్యం షాపుల యజమానులు మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.
షాపుల వద్దే మందు కొడుతున్న మందుబాబులు
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్
(ఆంధ్రజ్యోతి,పెద్దపల్లి)
ఓవైపు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న మద్యం షాపుల యజమానులు మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మద్యం షాపుల్లో సిట్టింగులను బార్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మద్యం ప్రియులు మాత్రం వైన్ షాపుల దగ్గరే మందు తాగుతూ ఖాళీ గ్లాసులు పార్టీలను కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారు.
జిల్లాలో 1,233 మందికి కరోనా..
జిల్లాలో ఇప్పటికే 1,233 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇందులో 20 మందికి పైగా మృతిచెందారు. సగం మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందరంగా రాష్ట్రంలో మద్యం షాపులను అన్నింటిని ప్రభుత్వం మూసివేసింది. లాక్డౌన్లో సడలింపులు ఇచ్చిన తరువాత ప్రభుత్వం మే 6వ తేదీ నుంచి మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా మద్యం షాపుల్లో సిట్టింగులు పెట్టరాదని ఆదేశాలు జారి చేసింది. బార్లు తెరిచేందుకు ఇప్పటికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో చాలామంది మద్యం అలవాటు ఉన్నవాళ్లు షాపుల వద్ద కొనుగోలు చేసి ఇళ్లకు వెళ్లి తాగుతున్నారు. దినసరి కూలీలు ఇతరులు కొందరు మాత్రం మద్యం షాపుల వద్ద మద్యం సేవిస్తున్నారు.
జిల్లాలో 72 మద్యం షాపులు..
జిల్లాలో 72 మద్యం షాపులు ఉండగా, వాటి యజమానులు నిబంధనలను పాటించడం లేదని తెలుస్తున్నది. పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, మంథని, సుల్తానాబాద్, ధర్మారం తదితర మండలాల్లోని మద్యం షాపుల పక్కనే చాలామంది మద్యం సేవిస్తున్నా కూడా ఆ షాపుల యజమాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మద్యం సేవించే గ్లాసులను, సీసాలను పక్కనే పడేస్తున్నారు. మద్యం దుకాణాల్లో కేవలం మద్యం మాత్రమే విక్రయించాల్సి ఉండగా ఖాళీ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు విక్రయిస్తుండటంతో చాలామంది మద్యం ప్రియులు అక్కడే మద్యం సేవిస్తున్నారు.
మద్యం సేవించి గ్లాసులను అక్కడ పడేయడం వల్ల అందులో ఎవరికైనా కరోనా వైరస్ ఉన్నట్లయితే దాని ప్రభావం ఇతరుల మీద చూపే ప్రమాదం ఉంది. అయినా కూడా ఇవేమీ పట్టించుకోకుండానే మద్యంషాపుల యజమానులు నిబంధనలు భేఖాతరు చేస్తున్న కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మద్యం షాపులో తనిఖీలు చేసేవారే కరువయ్యారు. షాపుల వద్ద పలువురు మద్యం సేవిస్తూ ఉండటంతో మద్యం కోనుగోలు కోసం వచ్చేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి మద్యం షాపుల వద్ద నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.