నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం
ABN , First Publish Date - 2020-10-25T10:21:07+05:30 IST
వరద ప్రభావిత లంక గ్రామాల్లో పంట నమోదులో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ అధికారులను ఆదేశించారు.
పంట నమోదులో బాధ్యతగా వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ ఆనంద్కుమార్
భట్టిప్రోలు, అక్టోబరు 24: వరద ప్రభావిత లంక గ్రామాల్లో పంట నమోదులో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ అధికారులను ఆదేశించారు. మండలంలోని లంక గ్రామాల్లో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే నాగార్జునతో కలిసి మండలంలోని పెదలంక మధ్యగూడెం, చింతమోటు గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందించేలా నమోదు జరగాలన్నారు. పొలాల్లో నీరు నిలిచిన కారణంగా వెళ్లడం కుదరడం లేదని పంట నమోదు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ముంపునకు గురైన ప్రతి ఎకరా నమోదు చేయాల్సిందేనని అప్పటివరకు రోడ్ల వెంబడి ఉన్న పొలాలను నమోదు చేయాలని ఆయన చెప్పారు. చింతమోటులో గృహాల మధ్య గుంతల్లో నిలిచి ఉన్న నీటిని వరద నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను కూడా పరిగణననలోకి తీసుకుని నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే నాగార్జున కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ మయూరి అశోక్, తహసీల్దార్ ఎంఎల్ శ్రావణ్కుమార్, ఎంపీడీఓ బి.బాబూరావు, ఈఓపీఆర్డీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.