దాడులకు భయపడొద్దు
ABN , First Publish Date - 2022-01-28T06:37:19+05:30 IST
కార్యకర్తలు ఎవరూ దాడులకు భయడపడొద్దని ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నందిపేట, నిజామాబాద్ (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి) జనవరి 27: కార్యకర్తలు ఎవరూ దాడులకు భయడపడొద్దని ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జిల్లాలో నందిపేటలో గురువారం పర్యటించిన ఆయన కార్యకర్తల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దాడులు బీజేపీకి కొత్తకాదన్నారు. నక్సలైట్ల కాలం నుంచే దాడులు జరుగుతున్నా తట్టుకుని నిలబడ్డామన్నారు. చార్మీనార్ గడ్డమీద గర్జించిన పార్టీ మనదని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఆర్మూర్లో జరిగిన దాడులకు ఎవరూ వెరవవద్దని పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. రాబోయే రోజులు బీజేపీవేనని వచ్చే ఎన్ని కల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రజల్లో బీజేపీపట్ల అభిమానం పెరుగుతుండడంతో ఓర్వలేకనే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇందూరులో పార్టీ బలం పుంజుకుంటుంటే ఓర్వలేకనే ఈ దాడులు చేశారని ఆయన అన్నారు. దాడులు జరిగిన కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్మూర్, నందిపేటలో పలువురు కార్యకర్తలతో మాట్లాడిన ఆయన మరింత ఉత్సాహంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఎంపీ అర్వింద్ కాన్వాయ్పై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అధ్యక్షునితో పాటు అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, రాష్ట్ర ప్రధాన కార్యర్శి ప్రేమేందర్రెడ్డితో పాటు ఇతర నేతలు భారీగా నేతలు కదిలి వచ్చారు. జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్యతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఇందల్వాయి టోల్గేట్ నుంచి నందిపేట వరకు నేతలంతా ఆయన వెంట రావడంతో రహదారుల వెంట భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒకే సారి వందల మంది కార్యకర్తల మధ్య రాష్ట్రస్థాయి నేతలు కదిలిరావడంతో పార్టీ నేతల్లో జోష్ కనిపించింది. దాడులతో నిస్తేజంగా ఉన్న బీజేపీ శ్రేణులకు అధ్యక్షుడి పర్యటన మనోధైర్యం నింపిందని పార్టీ నేతలు తెలిపారు.