వ్యాక్సిన్పై నిర్లక్ష్యం వద్దు
ABN , First Publish Date - 2021-12-03T04:07:18+05:30 IST
కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజలు ఇంకా జంకుతున్నారు. కరోనా కాటుకు జిల్లాలో వందల మంది మృతి చెందినా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. ప్రభుత్వం కొవిషీల్డ్, కొవాగ్జీన్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టీకా ద్వారా యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.
మొదటి డోసు వ్యాక్సినేషన్ 95.18 శాతం పూర్తి
రెండో డోస్ 45.74 శాతమే..
జిల్లాలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు 25,821
అధికారులు ఫోన్ చేస్తున్నా పట్టించుకోని వైనం
పొంచి ఉన్న ఒమైక్రాన్ భయం
బెల్లంపల్లి, డిసెంబరు 2 : కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజలు ఇంకా జంకుతున్నారు. కరోనా కాటుకు జిల్లాలో వందల మంది మృతి చెందినా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. ప్రభుత్వం కొవిషీల్డ్, కొవాగ్జీన్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టీకా ద్వారా యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఇంటింటికి వెళ్లి, ఫోన్ల ద్వారా సూచిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవడం లేదు. తాజాగా ఇతర దేశాల్లో ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయినప్పటికీ కొవిడ్ టీకా తీసుకునే విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.
వ్యాక్సిన్పై ఆసక్తి చూపని ప్రజలు
జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్కు అర్హులైన వారు 5,36,109 మంది ఉన్నారు. ఇందులో మొదటి డోసు వ్యాక్సిన్ ఇప్పటి వరకు 5,10,288 మంది తీసుకున్నారు. ఇప్పటికి మొదటి డోసు వేయించుకోని వారు 25,821 మంది ఉన్నారు. వ్యాక్సిన్పై వీరు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్ 95.18 శాతం పూర్తయ్యింది. రెండో డోసు 45.74 శాతానికి చేరింది. ఇప్పటి వరకు రెండో డోసు వ్యాక్సిన్ 2,07,897 మంది వేయించుకున్నారు. మొదటి డోసు కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 84 రోజుల గడువు, కొవాగ్జీన్ 28 రోజుల గడువు పూర్తయినప్పటికీ రెండో డోసు వేయించుకోని వారు 42,125 మంది ఉన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చని వైద్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నా ఆసక్తి చూప డం లేదు. మొదటి డోసు వేయించుకుని రెండో డోసుకు అర్హత సాధించిన వారి పూర్తి వివరాలు వైద్య శాఖ అధికారుల వద్ద ఉన్నాయి. వీరి సెల్ నెంబర్లకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించాక జిల్లాలో గతంతో పోల్చితే కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇతర దేశాల్లో కొత్త రకాల వేరియంట్లు ఒమైక్రాన్ వంటి వైరస్ల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తమై వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వ్యాక్సిన్ తీసుకోకుంటే తిప్పలే
కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇక నుంచి సినిమాహాళ్లు, పబ్లు, పార్కులు, షాపింగ్ మాల్స్లోకి ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో రూ. వెయ్యి జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండి తీరాల్సిందే.