మోదీ చాలా మంచోడు.. స్వరం మార్చిన ట్రంప్..!
ABN , First Publish Date - 2020-04-08T16:41:41+05:30 IST
మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని..
న్యూఢిల్లీ: మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్-19 మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటంపై ప్రశంసలు కురిపించారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ 29 మిలియన్లకు పైగా హెచ్సీక్యూ డోసులు కొనుగోలు చేశాం. ఇందులో ఎక్కువగా భారత్ నుంచే వచ్చాయి. దీనిపై భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడాను. ఆయన నిజంగా చాలా మంచివారు. వాస్తవానికి భారత్లో కూడా ఇప్పుడు ఇవి చాలా అవసరం కావడంతో.. వాటిని పంపుతారా లేదా అని నేను మోదీని అడిగాను. అయినా మంచి మనసుతో వాటిని పంపుతున్నారు. ఇక్కడ చాలా మందికి ఆ మందులు అవసరం. నేను మంచి వార్తలు మాత్రమే వింటాననీ.. చెడ్డవి విననని మీకు తెలుసు. అంతేకాదు.. మరణానికి కారణమయ్యే విషయాలు నేను అస్సలు వినాలనుకోను. అయితే ఇది అలాంటిది కాదు...’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో కలిసి తాము వ్యాక్సీన్లు తయారు చేసేపనిలో ఉన్నామనీ... వాటిని పరీక్షించాల్సి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మలేరియా ప్రభావిత దేశాల్లో ఇలాంటి సమస్యలు సాధారణమే అయినందున అక్కడ కరోనా ప్రభావం అంతగా పడలేదనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. హెచ్సీక్యూ ఎగుమతికి సహకరించకపోతే- భారత్పై ప్రతీకారం తప్పదని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే హెచ్సీక్యూ, పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా సడలించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న భారత్.. ఆయన వ్యాఖ్యను అంతగా పట్టించుకోలేదు. కాగా తమ దేశానికి భారత్ ఔషధాలు పంపడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో సైతం మోదీకి ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.