ఎన్నికల్లో వలంటీర్లను పక్కన పెట్టండి
ABN , First Publish Date - 2021-10-23T04:56:53+05:30 IST
బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను పక్కన పెట్టాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కమిషనర్ను డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేతల డిమాండ్
బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 22: బుచ్చి నగర పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను పక్కన పెట్టాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు కమిషనర్ను డిమాండ్ చేశారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితాల అభ్యంతరాలపై అఖిలపక్ష నాయకులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో ముగ్గురు ఎన్నికల అధికారుల బృందంతోపాటు కమిషనర్ ఎన్నికల పర్యవేక్షణాధికారిగా ఉంటారని కమిషనర్ తెలిపారు. బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్లు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. సంక్షేమ పథకాలు తొలగిస్తామని ఓటర్లను భయపెట్టి అధికారపార్టీకి ఓట్లు వేయించారని విమర్శించారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఓటర్లను బెదిరించడం, ఓట్లు అడగడం లాంటి చర్యలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వలంటీర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు ప్రచారం చేయాలన్నారు. వలంటీర్ల ప్రభావంతో ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్ల పేర్లు మరో వార్డులో ఉన్నాయన్నారు. వాటిని సరిచేసి జాబితాలు తయారు చేస్తే తప్ప ఎన్నికలు పారద్శకంగా జరగవన్నారు. లేదంటే ఎదురయ్యే ఎలాంటి ఘర్షణలకైనా అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైసీపీ నాయకుడు ఇన్నమూరి నరసింహరావు, టీడీపీ నాయకులు ఎంవీ. శేషయ్య, బత్తల హరికృష్ణ, కావలి వెంకటేశ్వర్లు, నెల్లూరు ప్రభాకర్రెడ్డి, దుగ్గిశెట్టి హరనాథ్, బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు, గంజం పెంచల ప్రసాద్, రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.