పల్లెజనం గొంతెండుతోంది..!
ABN , First Publish Date - 2020-05-28T10:28:35+05:30 IST
జిల్లాలో రెండువేలకుపైగా పల్లెల్లోని జనం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. దాంతో 1,740 పల్లెలకు ట్యాంకర్ల
- - 2వేలకుపైగా గ్రామాల్లో తాగునీటి సమస్య
- - ఈ పరిస్థితుల్లోనూ నీటి ట్రిప్పుల్లో చేతివాటమా?
చిత్తూరు (వ్యవసాయం), మే 27: జిల్లాలో రెండువేలకుపైగా పల్లెల్లోని జనం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. దాంతో 1,740 పల్లెలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తుండగా, 260 చోట్ల టైఅప్ ద్వారా అధికారులు అందిస్తున్నారు. ఎక్కడైనా తాగునీటి ఎద్దడి తలెత్తితే వెంటనే ఆయా మండలాల్లో ఉండే ఏఈకి చెప్పి ప్రైవేటు ట్యాంకరు ద్వారా సరఫరా చేయించేట్లు చూస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నా ప్రభుత్వం చాలా నిబంధనలు విధించింది. ఎన్ని ట్రిప్పులు తోలుతున్నారన్న దానిపై ట్రిప్షీట్ ఉండాలి. వెనుకనున్న ప్రదేశం కవరయ్యేలా విధిగా ఫొటోలు తీయించాలి. ట్యాంకరుకు జీపీఆర్ఎస్ పెట్టాలి. ఇవేమీ లేకుండానే ఓ ట్రిప్పు తోలితే నాలుగు తోలినట్టు సంబంధిత కాంట్రాక్టరుతో అధికారులు కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారని గత డీఆర్సీలో అధికారపార్టీ ఎమ్మెల్యేలే ఆగ్రహించారు. అయినా వారి తీరు మారడం లేదన్న విమర్శలున్నాయి.
పెండింగ్లో రూ.99 కోట్ల బిల్లులు
కుప్పం, పలమనేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల పరిధిలోని పలు పల్లెలకు ఏడాది పొడవునా నీటిని ట్యాంకర్లతో రవాణా చేస్తున్నారు. గత ఏడాదైతే 4వేల పల్లెలకుపైగా ట్యాంకర్లతో నీటిని రవాణా చేశారు. దాంతో అప్పుడు రవాణా చేసిన పల్లెలకు కూడా ఇప్పటివరకు బిల్లుల చెల్లింపులు పూర్తిచేయలేదు. ఇలా ఇంకనూ రూ.99కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి.