హైదరాబాద్ : విధి నిర్వహణలో మందేసి చిందేసిన హోంగార్డు!
ABN , First Publish Date - 2020-05-31T13:32:34+05:30 IST
విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు మద్యం తాగి, తూగుతూ దారిన వెళ్తున్న..
హైదరాబాద్/అఫ్జల్గంజ్ : విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు మద్యం తాగి, తూగుతూ దారిన వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేసిన సంఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జియాగూడలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఆర్ హెడ్క్వార్టర్స్కు చెందిన హోంగార్డు శ్రీనివాస్కు కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో విధులు కేటాయించారు.
వారం రోజులుగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అతడు శనివారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో జియాగూడ గోపి హోటల్ సమీపంలో మద్యం మత్తులో రోడ్డుపై హంగామా సృష్టించాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తుండగా, కుల్సుంపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని సీఐ పి. శంకర్ తెలిపారు.