హత్య కేసులో నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-02T05:03:17+05:30 IST
పాతకక్షల నేపధ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పాత గొడవలే హత్యకు కారణం
నెల్లూరు(స్టోన్హౌస్పేట), డిసెంబరు 1: పాతకక్షల నేపధ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జి.శ్రీనివాసులరెడ్డి విలేకర్లకు వవరాలు వెల్లడించారు. తమళనాడుకు చెందిన రాము అలియాస్ అనాచి అలియాస్ నాగరాజు(60) రెండు నెలల క్రితం నెల్లూరుకు వచ్చారు. మినీబైపాస్లోని సాయిబాబ గుడి వద్ద బిక్షాటన చేసుకుంటూ రాత్రి వేళ్లల్లో అక్కడే నిద్రించే వాడు. గత నెల 24న ఎన్టీఆర్ నగర్కు చెందిన పాత నేరస్థుడు ఎ హర్షవర్ధన్ అలియాస్ కనిగిరి సాయిబాబా గుడి సమీపంలో మద్యం తాగుతుండగా మృతుడు రాము తనకు మద్యం ఇవ్వాలని కోరగా అందుకు హర్షవర్ధన్ నిరాకరించాడు. దీంతో అతను హర్షవర్ధన్పై దాడికి దిగాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న హర్షవర్ధన్ రాముపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన సోదరుడు బాలవర్ధన్తో పాటు స్నేహితులు ఎన్టీఆర్ నగర్కు చెందిన ఎన్ మోహన్ అలియాస్ చందు, నవాబుపేట రామచంద్రాపురంకు చెందిన ఎం అనీల్, కుసుమ హరిజనవాడకు చెందిన యేసుదాస్లకు విషయం తెలిపాడు. దీంతో రామును హత్య చేసేందుకు అదును కోసం అందరూ ఎదురు చూశారు. గత నెల 26వ తేదీన అర్ధరాత్రి గుడి వద్ద రాము నిద్రపోవడాన్ని గమనించి కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో రాముతో పాటు అక్కడే నిద్రిస్తున్న ఎల్ కుమార్జాన్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వారిద్దరిని 108లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాము గత నెల 27న మృతి చెందాడు. ఈ ఘటనపై బాలాజీనగర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజ్లు, సాంకేతిక ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.