వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర
ABN , First Publish Date - 2021-10-17T04:41:05+05:30 IST
దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని ఆసిఫాబాద్లో శనివారం ఘనంగా నిర్వహించారు.
- ఘనంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం
- ముగిసిన శరన్నవరాత్రులు
ఆసిఫాబాద్, అక్టోబరు 16: దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని ఆసిఫాబాద్లో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆయా కాలనీల్లో విగ్రహాల శోభయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు. యువతులు, మహిళలు కోలాటం ఆడుతూ నృత్యాలు చేశారు. అనంతరం పెద్దవాగులో దేవి విగ్రహాలను నిమజ్జనం చేశారు.డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ అశోక్, ఎస్సైలు గంగన్న, వెంకటేష్, రాజేశ్వర్లు బందో బస్తు చేపట్టారు.
కాగజ్నగర్: దుర్గాదేవి విగ్రహాల శోభాయాత్ర పట్టణంలో శనివారం వైభవంగా సాగింది. పట్టణంలోని వివిధ కూడళ్లలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. శనివారం ఉదయం దుర్గామాత విగ్రహాల ఊరేగింపు నిర్వహించి స్థానిక పెద్దవాగులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాటాలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
దహెగాం: మండలంలోని రాంపూర్, గిరివెల్లి, దహెగాం, పీకలుడం, రాళ్లగూడ గ్రామాల్లో శనివారం దుర్గాదేవి నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాలను భాజా భజంత్రీలు, నృత్యాల చేస్తూ శోభయాత్ర నిర్వహించి సమీప వాగుల్లో నిమజ్జనం చేశారు.
బెజ్జూరు: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం దుర్గామాత విగ్రహాలను నిమజ్జనంను ఘనంగా నిర్వహించారు. మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అంతకుముందు శోభాయాత్ర నిర్వహించి సమీప వాగుల్లో నిమజ్జనం చేశారు.
కెరమెరి: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.