దసరా వచ్చిందయ్యా!

ABN , First Publish Date - 2020-10-25T10:43:19+05:30 IST

జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు,..

దసరా వచ్చిందయ్యా!

 నేడు విజయదశమి

కరోనా ప్రభావంతో కాస్త తగ్గిన సందడి

పూజా సామగ్రి కొనుగోలుకే ఎక్కువ మంది పరిమితం


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమాభిషేకాలు నిర్వహించారు. ఆదివారం విజయదశమిని పురస్కరించుకుని.. పూజా సామగ్రి కొనుగోలు చేసే వారితో మార్కెట్లు కిటకిటలాడాయి. జిల్లా కేంద్రం శ్రీకాకుళంతో పాటు ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గ, రాజాం, టెక్కలి, ఆమదాలవలస, పాలకొండ, సోంపేట ప్రాంతాల్లో రద్దీ కనిపించింది. వాహనాల సర్వీసింగ్‌ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. ఏటా దసరా వచ్చిందంటే చాలు..


వస్త్ర, బంగారం దుకాణాలు, వాహనాల షోరూంలు, గృహోపకరణాల సామగ్రి దుకాణాలు వినియోగదారులతో కళకళలాడేవి. కానీ ఈ ఏడాది కరోనా వ్యాప్తి ప్రభావంతో దసరా సందడి కాస్త తగ్గింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినా.. ఇప్పటికీ చాలా మందికి ఉపాధి మార్గం కరువైంది. దీంతో ఆ కుటుంబాల్లో పండగ సందడి కనుమరుగైంది. కొంతమంది కేవలం పూజాసామగ్రి కొనుగోలుకు పరిమితమయ్యారు. వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించే సదుపాయం ఉండడంతో కొంతమంది ద్విచక్ర వాహనాలు, ఫ్రిజ్‌లు, టీవీలు కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోల్చితే విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-10-25T10:43:19+05:30 IST