రాజన్న క్షేత్రంలో దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-17T05:12:30+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో దసరా ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి.

రాజన్న క్షేత్రంలో దసరా ఉత్సవాలు
ఆలయ ఆవరణలో శమీపూజ నిర్వహిస్తున్న అర్చకులు

వేములవాడ, అక్టోబరు 16 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో దసరా ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరీ అమ్మవారు తొలుత సిద్దిదా, అనంతరం మహాలక్ష్మి (రాజరాజేశ్వరీదేవి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు తొలుత  రాజరాజేశ్వరీదేవీ అమ్మవారికి మహాభిషేకం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజ, రాజరాజేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేశారు. సాయంత్రం ధ్వజారోహణం గావించిన అనంతరం  రాజరాజేశ్వరీ అమ్మవారిని మహాలక్ష్మి ( రాజరాజేశ్వరీదేవి) అవతారంలో అలంకరించారు. అనంతరం గజవాహనంపై  పార్వతీరాజరాజేశ్వరస్వామి, లోఈ్మ అనంతపద్మనాభస్వామివారి ఉత్సవ మూర్తులను అలంకరించి అపరాజిత పూజ నిర్వహించి ఆలయ ఆవరణలో శమీపూజ నిర్వహించారు. 

కొవిడ్‌ నేపథ్యంలో శమీయాత్ర రద్దు

విజయదశమి సందర్భంగా నిర్వహించాల్సిన  స్వామివారల శమీయాత్ర  కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో రద్దు చేసి ఆలయ ఆవరణలోనే నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా గజవాహనంపై ఆసీనులైన  పార్వతీరాజరాజేశ్వరస్వామి,  లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారి ఉత్సవ మూర్తులతో పట్టణ వీధుల మీదుగా మహాలక్ష్మీ ఆలయం సమీంలోని శమీవృక్షం వద్దకు యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా శమీయాత్ర రద్దు చేశారు. ఆలయ ఆవరణలో శమీపూజ నిర్వహించారు. ఆలయ ఆవరణలోనే గజవాహనంపై  స్వామివారల ఊరేగింపు చేపట్టారు. దసరా సందర్భంగా కులమతాలకు అతీతంగా వేలాది మంది ప్రజలు బంగారం (జమ్మి ఆకు) ఇచ్చిపుచ్చుకున్నారు.  పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, పట్టణ ప్రముఖులు ప్రత్యేక పూజలలో పాల్గొనగా పెద్ద సంఖ్యలో భక్తులు దసరా ఉత్సవాలలో ఆనందోత్సాహాలతో పాలుపంచుకున్నారు. 

 

Updated Date - 2021-10-17T05:12:30+05:30 IST