ఆర్టీసీకి కలిసొచ్చిన దసరా
ABN , First Publish Date - 2021-10-20T04:37:39+05:30 IST
దసరా పండుగ ఆర్టీసీకి కలిసొచ్చింది. నష్టాల్లో ఉన్న సంస్థకు ఊరటనిచ్చేలా ఆదాయం సమకూరింది
ఒక్క రోజే రూ.1.06 కోట్ల ఆదాయం
నష్టాల్లో ఉన్న సంస్థకు కాస్త ఊరట
సంగారెడ్డి డిపోకు అధిక ఆదాయం
సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 19 : దసరా పండుగ ఆర్టీసీకి కలిసొచ్చింది. నష్టాల్లో ఉన్న సంస్థకు ఊరటనిచ్చేలా ఆదాయం సమకూరింది. విజయదశమి సందర్భంగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న చర్యలు ఫలించాయి. దసరా పండగను పరస్కరించుకుని ఆర్టీసీ 270 ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో సోమవారం ఒక్క నాడే మెదక్ రీజియన్ పరిధిలో రూ.కోటి ఆరు లక్షల ఆదాయం రావడం ఉత్సాహానిచ్చింది. అందులో మెదక్ డిపో రూ.17 లక్షలు, నారాయణఖేడ్ రూ.10 లక్షలు, సంగారెడ్డి రూ.20 లక్షలు, జహీరాబాద్ రూ.17 లక్షలు, సిద్దిపేట రూ.17 లక్షలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రూ.11 లక్షలు, దుబ్బాక రూ.5 లక్షలు, హుస్నాబాద్ రూ.7 లక్షలు ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అన్ని డిపోల కంటే సంగారెడ్డి డిపోకు ఎక్కువ ఆదాయం రావడంతో డిపో మేనేజర్ నాగభూషణం, సీఐ నవీన్యాదవ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు.