చలికాలంలో పెరుగు తింటే..?
ABN , First Publish Date - 2020-12-18T17:58:12+05:30 IST
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి. పాలలో కంటే పెరుగులో లాక్టోజు పరిమాణం తక్కువ. పాలలోని లాక్టోజ్ సరిపడని కారణంగా పాలు, పాల ఉత్పత్తులు తిన్నప్పుడు జీర్ణాశయ ఇబ్బందులు పడేవాళ్ళు కూడా పెరుగును హాయిగా తినవచ్చు.
ఆంధ్రజ్యోతి(18-12-2020)
ప్రశ్న: చలి కాలంలో పెరుగు తినొచ్చా? పిల్లలకు కూడా పెట్టవచ్చా?
- జగదీశ్, ఆదిలాబాద్
డాక్టర్ సమాధానం: పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి. పాలలో కంటే పెరుగులో లాక్టోజు పరిమాణం తక్కువ. పాలలోని లాక్టోజ్ సరిపడని కారణంగా పాలు, పాల ఉత్పత్తులు తిన్నప్పుడు జీర్ణాశయ ఇబ్బందులు పడేవాళ్ళు కూడా పెరుగును హాయిగా తినవచ్చు. పెరుగులో కూడా ప్రొటీన్లు పుష్కలం. పాలలో కన్నా పెరుగులో ప్రొటీన్లను శరీరం త్వరగా శోషించుకుంటుంది. పెరుగులో అధిక మోతాదులో లభించే గ్లెయిసిన్, ప్రొలైన్ అనే అమైనో ఆమ్లాలు చర్మాన్ని, గోళ్లను, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. క్యాన్సరును, ముఖ్యంగా బ్రెస్ట్క్యాన్సర్, పెద్దపేగుల క్యాన్సర్ల నిరోధకంగా పని చేసే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే ఫాటీయాసిడ్ ఇళ్లల్లో తయారు చేసుకునే పెరుగులో ఎక్కువ. మలబద్ధకాన్ని పోగొట్టడానికి, నీళ్ల విరోచనాలను నియంత్రించడానికి పెరుగు ఉపయోగపడుతుంది. చలికాలంలో పెరుగును చల్లగా తినడానికి ఇష్టపడకపోతే పగటి పూట చిక్కటి మజ్జిగగానో, కూర ముక్కలు వేసి రైతా లాగానో, రోటి పచ్చళ్లలో, కూరల్లో కలపడం ద్వారానో తీసుకోవచ్చు. ఏ కాలంలో అయినా కనీసం రోజుకు ఒక్క పూట పెరుగు తీసుకుంటే మంచిది. ఇది అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)