పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T05:18:19+05:30 IST

గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేయాలని వారెంట్లు, సమన్లు అమలు విభాగం ఇన్‌చార్జి తిమ్మాపూర్‌ సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
శిక్షణ సమావేశంలో మాట్లాడుతున్న తిమ్మాపూర్‌ సీఐ శశిధర్‌రెడ్డి, హాజరైన పోలీసు అధికారులు

కరీంనగర్‌ క్రైం, జనవరి 19: గత కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేయాలని వారెంట్లు, సమన్లు అమలు విభాగం ఇన్‌చార్జి తిమ్మాపూర్‌ సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌లో వారెంట్లు, సమన్లు అమలు విభాగానికి చెందిన పోలీసులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్న చిన్న నేరాలతో పాటు సంచలనాత్మక కేసుల్లో పరారీలో ఉన్న నిందితులపై జారీ అయిన వారెంట్లను అమలు చేసి వారిని అరెస్టు చేసి న్యాయస్థానాల్లో హాజరు పరిస్తే సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న  కేసులు పరిష్కారమవుతాయన్నారు. కొన్ని కేసుల్లో పరారీలో ఉన్న నిందితులు పోలీసులు వారెంట్ల అమలు ను సీరియస్‌ తీసుకున్నారన్న విషయం తెలుసుకుని నిందితులు లొంగిపోతున్నారన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సైతం వెళ్లి తప్పించుకు తిరుగుతున్న నిందితులను అరెస్టు చేయడం శాఖకు గర్వకారణమన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. వారెంట్లు, సమన్లు అమలుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్‌ఎస్‌లో నమో దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిసెల్‌ విభాగం ఇన్స్‌స్పెక్టర్‌ జయేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:18:19+05:30 IST