మన గురించి ఏం రాస్తున్నారు?
ABN , First Publish Date - 2021-11-26T09:06:36+05:30 IST
వచ్చేది ఎన్నికల కాలం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకునే నిర్ణయాలు, తత్సంబంధిత
- మీడియాలో తన వార్తల కవరేజీపై ఎన్నికల కమిషన్ ఆరా
- ప్రైవేటు ఏజెన్సీ నియామకానికి టెండర్ల ఆహ్వానం
న్యూఢిల్లీ, నవంబరు 25: వచ్చేది ఎన్నికల కాలం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకునే నిర్ణయాలు, తత్సంబంధిత వార్తలకు పత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్, సోషల్ మీడియాలో కవరేజీ ఎంత లభిస్తుందో తెలుసుకునేందుకు కమిషన్ సరికొత్త ఆలోచన చేసింది. కవరేజీపై ఆరా తీసి ఫీడ్బ్యాక్ నివేదికలు అందించే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అర్హత కలిగిన సంస్థలు ఈ నెల 30లోగా బిడ్లు దాఖలుచేయాలని పేర్కొంది. వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రక్రియలకు అన్ని ప్రధాన పత్రికలు, చానళ్లు, ఆన్లైన్ మీడియా, సామాజిక మాధ్యమ వేదికలు, విదేశీ ప్రెస్ ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తున్నాయో ఆ ప్రైవేటు సంస్థ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు పెట్టే పోస్టులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.