నల్లబ్యాడ్జీలతో నిరసన
ABN , First Publish Date - 2021-12-08T05:24:01+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వాసుపత్రి, ఆర్ట్స్ కళాశాల, ఈఎస్ఐ ఆసుపత్రి, పంచాయతీరాజ్ శాఖ, ఆర్అండ్బీ శాఖ, ఆర్ఐవో ఆఫీసు ఉద్యోగులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వ్యవసాయ శాఖ, డీవైఈవో, పబ్లిక్ హెల్త్, వాణిజ్య పన్నులు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులంతా పీఆర్సీ అమలు చేయాలని, డీఎ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొత్తం 71 డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. రాజమహేంద్రవరం ఏపీ జేఎసీ అధ్యక్షుడు వైవీ సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ ఇతర డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం వల్ల ఆందోళనకు సిద్ధమయ్యామన్నారు. ఇక దశలవారీ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీఎన్జీవో సంఘ కార్యదర్శి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఉద్యమానికి అందరూ మద్ధతు ఇవ్వడంతో మరింత బలం పెరిగిందని చెప్పారు. రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణుమాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వం కమిటీల పేర్లతో కాలయాపన చేస్తోందని అన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు పి.అనిల్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు పి.నాగేశ్వరరావు, మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు రవిబాబు, నరేష్, ఏపీటీఎఫ్ నాయకులు కేవీ సత్యనారాయణ పాల్గొన్నారు.