అర్హులైన వారికి ఉపాధి హామీ పనులు కల్పించాలి
ABN , First Publish Date - 2021-03-03T05:35:02+05:30 IST
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన వారికి పని కల్పించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీడీ రవీందర్తో కలిసి బెల్సరి రాంపూర్, దన్నోరా, వడూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పరిశీలించారు.
భీంపూర్, మార్చి2: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన వారికి పని కల్పించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీడీ రవీందర్తో కలిసి బెల్సరి రాంపూర్, దన్నోరా, వడూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పరిశీలించారు. కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం భీంపూర్ మండల రైతు వేదిక భవనంలో ఈజీఎస్ సిబ్బంది, ఏఈవోలతో సమావేశమై సూచనలు చేశారు. పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేద కుటుంబాలకు పని చూపించకుంటే అధికారులను బాఽద్యులు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈజీఎస్ కింద చేలల్లో ఆయా పనులు చేసుకునేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఉపాధి హామీ పనులలో ఏమైనా సమస్యలు ఉంటే కూలీలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వినోద్, వ్యవసాయ అధికారులు, ఈసీ నరేందర్, సర్పంచ్లు హనుమాన్దాస్, బక్కీ అజయ్, మడావిలింబాజి, రూపశంకర్ తదితరులున్నారు.
పనుల్లో నాణ్యత కొరవడితే చర్యలు..
తాంసి: మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కప్పర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నర్సరీలలో జరుగుతున్న పనులపై ఆయన ఆరా తీశారు. అనంతరం రైతు వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులంతా అభివృద్ధికి సహకరించాలన్నారు. ముఖ్యంగా యువత గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. ఇందులో ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్ సదానందం తదితరులున్నారు.
పుస్తకాలు, ఆట వస్తువుల పంపిణీ..
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్ చేతుల మీదుగా విద్యార్థులకు ఆట వస్తువులు, గ్రంథాలయ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వతరగతి నుంచి డిగ్రీ వరకు పుస్తకాలు లైబ్రెరీలుగా ఏర్పాటు చేసుకుని చదువుకుంటే భవిష్యత్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధింవచ్చన్నారు. ఇందులో ఏపీడీ రవీందర్, డీబీసీడీవో ఆశన్న, వార్డెన్ ఓం ప్రసాద్లున్నారు.